కోటగిరి/ పిట్లం/ రుద్రూర్/ బాన్సువాడ, జూలై 9: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు భక్తులు తామంతా క్షేమంగానే ఉన్నామని శనివారం ఫోన్ద్వారా వారి బంధువులకు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండగా శుక్రవారం అమర్నాథ్ క్షేత్రం సమీపంలో వరద బీభత్సం సృష్టించి వందలాది మంది యాత్రికులు గల్లంతై, పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు వంద మంది యాత్రికలు అమర్నాథుడిని దర్శించుకునేందుకు వెళ్లారు. కోటగిరి మండల కేంద్రం నుంచి పోల అశ్విన్కుమార్ ఆయన భార్య, తల్లి, మాశెట్టి గణేశ్ ఆయన భార్య, పొతంగల్కు చెందిన నరేందర్ ఆయన భార్య యాత్రకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం వీరు అమర్నాథ్ క్షేత్రానికి చేసుకోవాల్సి ఉండగా ఆదే రోజు మధ్యాహ్నం నుంచే అక్కడ వరద ఉధృతి పెరిగింది. అక్కడి సైనికులు, పోలీసు అధికారులు వీరిని క్షేత్రానికి వంద కిమీటర్ల దూరంలో నిలిపివేసి ఫహెల్గావ్ వద్ద సురక్షిత ప్రదేశంలో ఉంచారు.
పిట్లం గ్రామం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తొమ్మిది మంది సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల క్రితం ఉడుగుల లక్ష్మణ్, వారి ముగ్గురు సోదరులతో అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. వారితోపాటు నాయబ్ తహసీల్దార్ కాపర్తి సంఘమేశ్వర్ కూడా యాత్రకు వెళ్లారు. తాము క్షేమంగానే ఉన్నామని గ్రామస్తులకు ఫోన్ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఫహెల్గావ్ గ్రామంలో స్పైరో రీసెర్చ్ సెంటర్లో సురక్షితంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రుద్రూర్ మండలం నుంచి వెళ్లిన 12 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. తమను భద్రత సిబ్బంది సుక్షిత ప్రాంతంలో ఉంచినట్లు తెలిపారు. బాన్సువాడ నుంచి ఇటీవల అమర్నాథ్ యాత్ర వెళ్లిన యోగేశ్వర్, మధు, హన్మండ్లు, రఘు క్షేమంగా ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.