కమ్మర్పల్లి, జూలై 9: భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు. ఆటా మహా సభల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఆయన శనివారం నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్తోఫోన్లో మాట్లాడారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని 24 గంటలు అప్రమత్తంగా ఉంచుతూ అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లా కలెక్టర్కు సూచించారు. వాగులు, రోడ్లు, వంతెనలు, కల్వర్టుల వద్ద ఆర్అండ్బీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలన్నారు. తెగిపోయిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు విద్యుత్ సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఏఈలు, లైన్మెన్లు రెండు గంటలకు ఒకసారి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలోకి ఉధృతంగా వరద వచ్చి చేరుతున్నందున నదీ పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గేట్లు ఎత్తి నీటిని వదిలే ముందు దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నంబరును ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.