బాన్సువాడ, నవంబర్ 18 : రైతులు లాభసాటి పంటలను పండించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ మండలంలోని స్వగ్రామమైన పోచారంలో తన అల్లుడు వెంకట్రామ్రెడ్డి ఐదెకరాల వ్యవసాయ భూమిలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్పీకర్ సతీమణి పుష్పమ్మ, కుటుంబ సభ్యులు, రైతులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయిల్పామ్ మొక్కలను శుక్రవారం నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఆయిల్పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు పంటను ఇస్తాయని అన్నారు. నాలుగేండ్ల తర్వాత దిగుబడి ప్రారంభమై 30 ఏండ్ల వరకు దశల వారీగా లాభాలు వస్తాయని వివరించారు.
తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో 70 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ను రైతులు సాగుచేశారని తెలిపారు. అప్పటి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఆయిల్పామ్ సాగుకు అనుకూలమైన నేలలపై సర్వేచేయాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలోని 276 మండలాల్లో ఆయిల్పామ్ పంట సాగుకు నేలలు అనుకూలమని చెప్పారని గుర్తుచేశారు. రైతులు ఆయిల్పామ్ సాగుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలపై అవగాహన కల్పించారు. ఒక్కో మొక్క సుమారు రూ.200 ఉంటుందని, కానీ ప్రభుత్వం ప్రభుత్వం రైతుకు రాయితీపై కేవలం రూ.20 మొక్కను అందిస్తుందన్నారు. ఎరువులు, విత్తనాలు, డ్రిప్కు రాయితీ కల్పిస్తుందన్నారు.
2018లో జూన్లోనే బొప్పాస్పల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో రెండెకరాల ప్రభుత్వ భూమిలో ఆయిల్ పామ్ సాగు చేశామన్నారు. ప్రస్తుతం గెలలు వచ్చాయని తెలిపారు. అంతర్ పంటగా మల్బరీ వేప నాటామని, ఏపుగా పెరిగి పెద్దవి అయ్యాయని వివరించారు. ఇలా రెండు పంటల ద్వారా రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో స్పీకర్ ఫోన్లో మాట్లాడి ఆయిల్పామ్ సాగులో ఆయన అనుభవాలను రైతులకు వినిపించారు. అనంతరం విశ్వతేజ్ ఆయిల్పామ్ ఇండస్ట్రీ వారు పంట సాగుపై అవగాహన కల్పించేలా రూపొందించిన బ్రోచర్ను స్పీకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరిగె శంభురెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, పోచారం సర్పంచ్ రాధాసాయిరెడ్డి, పరిగె వెంకట్రామ్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఉద్యావనశాఖ అధికారి రాజాగౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.