కామారెడ్డి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో 40 పరీక్షా కేంద్రాలను, 9 రూట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లు పరీక్ష సజావుగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక గదులు కేటాయించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లవద్దని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏవో రవీందర్, పరీక్షల విభాగం అధికారి లింగం, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించే గ్రూప్-4 పరీక్ష కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్పీఎస్సీ అధికారులతో మాట్లాడారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసివేసే విధంగా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. పోలీస్ శాఖ సహకారంతో కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్లో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఈవో రాజు, ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.