కామారెడ్డి, ఫిబ్రవరి 2: అన్నంపెట్టే రైతన్నలను మోసం చేయొద్దని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే డీలర్లు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రైతులకు నాణ్యమైన, మేలు రకం విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి డివిజన్లోని 40 మంది ఇన్పుట్ డీలర్లకు 48 వారాల పాటు నిర్వహించిన వ్యవసాయ విస్తరణ సేవ డిప్లమా కోర్సులో ఉత్తీర్ణులైన వారితో సమావేశమయ్యారు.ఈ సంరద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విక్రయదారులకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే రైతులకు సరైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తూ మెలకువలు తెలుపుతారని అన్నారు. అనంతరం బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన రవీందర్ రెడ్డి,సంతోష్,సాయిచరణ్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రత్న భారతి, లక్ష్మీప్రసన్న, సునీతారాణి, హరీశ్ కుమార్, శ్రీకాంత్, అనిల్ కుమార్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసే విధానంపై ఓటర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు.కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల పనితీరును పరిశీలించి యంత్రాల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో డెమో ప్రదర్శిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు అనిల్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.