కామారెడ్డి, ఫిబ్రవరి 23: కామారెడ్డి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలకవర్గ సభ్యులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. స్థానిక కళాభారతిలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి అదనపు కలెక్టర్ మనుచౌదరి, మున్సిపల్ కమిషనర్ సుజాతతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి రూ.4228.11 లక్షల అంచనా బడ్జెట్ 2023-24 సంవత్సరానికి సవరించి రూ.3666.4 లక్షల బడ్జెట్కు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పన్నుల రూపేణా రూ.1295.90 లక్షలు, అద్దెలు, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్ మార్గాల ద్వారా రూ.1368.21లక్షలు, డిపాజిట్లు, లోన్స్ ద్వారా రూ.22లక్షలు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్ ద్వారా రూ.142 లక్షలు వస్తాయని అంచనా వేశారు.
ఇందులో జీతాలు, శానిటేషన్, విద్యుత్ బిల్లులకు రూ.216 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కింద రూ.296 లక్షలు ఖర్చు చేయాలని నిర్దేశించారు. ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్,సాధారణ పరిపాలన ఖర్చులు రూ.138లక్షలు, వార్డుల వారీగా చేపట్టిన పనులు, ప్రజా ఉపయోగ పనులకు రూ.22.33 లక్షలు, డిపాజిట్లు, లోన్ల కింద రూ.22 లక్షలు, నాన్ ప్లాన్ గ్రాంట్ కింద రూ.1542 లక్షలు ఖర్చు చేసేందుకు రూపొందించిన ప్రణాళికలకు సభ ఆమోదం తెలుపుతూ తీర్మానించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, తాగునీరు వృథా కాకుండా ప్రతి ఒక్కరూ కుళాయిలు పెట్టుకునేలా చూడాలని కోరారు. వైకుంఠధామాలు వాడుకలో వచ్చేలా చూస్తామని సభ్యులను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.