నిజాంసాగర్/ గాంధారి/ లింగంపేట/ పిట్లం/బీబీపేట్/ ఎల్లారెడ్డి/ తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, జూలై 11 : జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాంధారి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, మధ్యాహ్నం 12 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండలకేంద్రంలో ఆదివారం అంగడి నిర్వహించడంతో సంతకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాధార పంటలైన మక్కజొన్న, పత్తి, సోయా, కంది పంటలకు ప్రస్తుతం కురిసిన వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బోరు బావుల వద్ద వరినాట్లు కొనసాగుతుండగా. ఈ వర్షంతో వ్యవసాయ పనులు మరింత ఊపందుకోనున్నాయి.
లింగంపేట మండల కేంద్రంతోపాటు భవానీపేట, మెంగారం, బోనాల్, బాణాపూర్, కోర్పోల్, లింగంపల్లి, నల్లమడుగు, ముంబాజీపేట, శెట్పల్లి, పర్మళ్ల, కోమట్పల్లి, పోతాయిపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం వర్షం కురిసింది. వర్షపు నీరు చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరింది.
బీబీపేట్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 0.8 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ఏఎన్వో ప్రేమలత తెలిపారు.
ఎల్లారెడ్డిలో ఇండ్లలోకి చేరిన నీరు..
ఎల్లారెడ్డిలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు కాలనీల్లోని ఇండ్లలోకి నీళ్లు చేరాయి. బీసీ కాలనీ, ఇంద్రానగర్ కాలనీల ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు. గాంధీచౌక్ నుంచి పెద్ద మసీదు వరకు వెళ్లే దారి బురదమయంగా మారింది.
పారిన వాగులు..
తాడ్వాయి మండలంలో సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో వాగులు పారాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లోకి నీరు వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగిరెడ్డిపేట మండలంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సయ్యద్ అహ్మద్ తెలిపారు. రెండు రోజుల్లో 297.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
నిజాంసాగర్ మండలంలో జోరు వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం కురియడంతో పంట పొలాల్లో నీరు నిలిచింది. నాగమడుగు వద్ద వర్షపు నీరు నిలువడంతో అచ్చంపేట నిజాంసాగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.