రైతులకు స్వర్ణయుగం : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతును రాజును చేసే మనసున్న మహారాజు కేసీఆర్ అని కొనియాడారు. సేద్యమైనా, వైద్యమైనా కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశ్వవిఖ్యాత జలభాండాగారమని, ఇది కేసీఆర్తోనే సాధ్యమైందని చెప్పారు. పునరుజ్జీవ పథకంతో ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాల సాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై జీవన్రెడ్డి విరుచుకు పడ్డారు. ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీ అని విమర్శించారు. పసుపు రైతులకు పంగనామాలు పెట్టాడని విమర్శించారు. అర్వింద్ మాట్లాడేది ఆయన తండ్రికి అర్థం కాదు, వాళ్లిద్దరూ మాట్లాడేది కుటుంబసభ్యులకు అర్థం కాదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో సాగునీటి గోసకు చెక్పడిందన్నారు. నీళ్లు పల్లమెరుగు అనేది రివర్స్ పంపింగ్ పథకంతో పాత సామెతగా మారిందన్నారు. ఆర్మూర్లో 11 లిఫ్టులు ఉన్నాయని, వాటితో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని తెలిపారు.
దేశానికి అన్నం వడ్డించే విస్తరిలా తెలంగాణ : కేఆర్ సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు
కేసీఆర్ సీఎంగా ఉంటేనే దేశానికి అన్నం పెట్టే విస్తరిలా తెలంగాణ ఉంటుందని, లేదంటే కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతుందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. కాళేశ్వరం జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను నింపుకోవడం ప్రారంభించిన ఈ రోజు యావత్ తెలంగాణకు పుణ్యదినమని, చారిత్రాత్మకమని వివరించారు. గతంలో ధర్నాలు చేయడానికో, ఇంకా ఏదైనా సమస్యకోసమో ఎస్సారెస్పీ వద్దకు వచ్చే వాళ్లమని.. నేడు ఎస్సారెస్పీని నింపుకొనే పండుగకు వచ్చామంటే కేసీఆర్ కృషి కారణమన్నారు. ఈ ప్రాంత రైతులు రెండువేల ఫీట్ల వరకు బోర్లు వేసేవారని, మహిళారైతులు తమ బంగారాన్ని బోరు బావుల పాలు చేసుకున్న దుస్థితిని ఆయన గుర్తుచేశారు. గంగమ్మను సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా తిప్పుతున్నాడన్నారు. ఈ క్రమంలో గంగమ్మ తకాయిస్తున్నదే కానీ కేసీఆర్ తకాయిస్తలేడు అని చమత్కరించారు. తెలంగాణ రైతులకు దండిగా పండించే దమ్మున్నదని, కేంద్రానికే కొనే దమ్ము లేదన్నారు.
తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నోళ్లకుపునరుజ్జీవమే సమాధానం
తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవారికి ఎస్సారెప్పీ పునరుజ్జీవ పథకమే సమాధానమని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వరద కాలువ ద్వారా దిగువన చెరువులు నింపుకోవచ్చని సూచించినప్పుడు ఇదే వరద కాలువ వరప్రదాయినిగా మారుతుందని ఊహించలేకపోయామన్నారు. సీఎం కేసీఆర్తోనే లిఫ్టు సాధ్యమయ్యిందన్నారు. పనిచేసే వ్యక్తులంటే కేసీఆర్కు ఎంతో ఇష్టమని, అందుకే మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై కేసీఆర్కు ప్రేమ ఉన్నదన్నారు. ప్రజలకు కావాల్సినది ఏదైనా వెంటనే ఇచ్చే మనసు కేసీఆర్దని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అర్వింద్ రైతులను వంచించాడన్నారు. అప్పటి ఎంపీగా కల్వకుంట్ల కవిత హామీ ఇవ్వకున్నా ఎమ్మెల్యేలను, 300 మంది రైతులను పసుపు బోర్డు కోసం ప్రధాని, ఆర్థిక మంత్రి, అస్సాం, మహారాష్ట్ర, కేరళ సీఎంలను విమానంలో తీసుకెళ్లి కలిశారని గుర్తుచేశారు. పసుపు బోర్డు కన్నా మంచి బోర్డు తెచ్చానని అర్వింద్ చెప్పడం విడ్డూరమన్నారు. అరవింద్ దళారుల మనిషే తప్ప ప్రజల మనిషి కాదన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్యాకేజీ 21తో ప్రతి మూడు ఎకరాలకు ఒక నల్లాలాగే సాగునీరు ఇవ్వబోతున్నామన్నారు.
కేసీఆర్ నాలెడ్జ్ అద్భుతం : విఠల్ రెడ్డి, ముథోల్ ఎమ్యెల్యే
సీఎం కేసీఆర్కు అద్భుతమైన ఇంజినీరింగ్ నాలెడ్జ్ ఉందని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన నాలెడ్జితో ప్రపంచమే అబ్బురపోయేలా కాళేశ్వ రం ప్రాజెక్ట్ను అందించారన్నారు. పునరుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీకి భరోసా ఏర్పడిందన్నారు. పునరుజ్జీవాన్ని అం దించిన కేసీఆర్కు, కీలక బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్యెల్యే రేఖానాయక్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పో చారం భాస్కర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్రావు, నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, నీటిపారుదల శాఖ సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ సుధాకిరణ్ పాల్గొన్నారు.
మూడు పంటలకు పుష్కలంగా నీళ్లు
మోర్తాడ్, జూలై 7: వరదకాలువలో ఏడాదంతా నీళ్లు ఉండడంతో మాకున్న ఆరెకరాల్లో మూడుపంటలు పండిస్తున్నాం. మూడుపంటలకు వరదకాలువ పుణ్యమా అని నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి. వరదకాలువ అయినప్పుడు నీళ్లస్తయని సంబురపడ్డం, కానీ వేసిన పంటలు కూడా సరిగా పండేవి కాదు. కాళేశ్వరం నుంచి నీళ్లు నింపడంతో వరదకాలువతో ఇప్పుడు లాభం చేకూరుతున్నది.
-గోపిడి సుభాష్, రైతు, మోర్తాడ్
వరదకాలువ నీళ్లతోనే ఎనిమిదెకరాలు పండిస్తున్నా
వరదకాలువ నీళ్లతోనే ఎనిమిదెకరాల్లో మూడు పంటలు పండిస్తున్న. ఇంతకుముందు వానకాలం మాత్రమే సాగుజేసేటోళ్లం. అదికూడా వరద కాలువలో నీళ్లు ఉంటే పంటలు పండుతుండే. లేదంటే ఎండిపోతుండే. నానా అవస్థలు పడేటోళ్లం. ఇప్పు డు నీళ్లకోసం బాధలు పడాల్సిన అవసరం లేదు. సీఎం, మంత్రి రైతులకు చేసిన మేలు మరువలేం.
– ఉప్లూర్ భూమన్న, రైతు, మోర్తాడ్
ఎస్సారెస్పీ నిండితేనే నీళ్లస్తయనుకున్నం
ఎస్సారెస్పీ నిండితేనే నీళ్లస్తయనుకున్నం. కానీ ఇప్పుడు ఎస్సారెస్పీలో నీళ్లు లేకున్నా వరదకాలువ నిండుకుండలా ఉంటుంది. దీంతో ఆయకట్టులో ఉన్న మాకు సాగునీటికి ఢోకా లేదు. ఇంతకుముందు చానా ఇబ్బందులు పడేటోళ్లం. కాళేశ్వరం జలాలు రావడంతో సాగునీటి సమస్యే లేకుండా పోయింది.
– కల్లెం గంగాధర్, రైతు, తిమ్మాపూర్