బాన్సువాడ టౌన్, జనవరి8 : బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేదీ వరకు పరిగె పాపమ్మ రాజిడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్మారక ప్రో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పోటీలు ఉమ్మడి జిల్లాల కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో జరుగుతాయని, అసోసియేషన్ రెండు జిల్లాల పరిధిలోని 16 జట్లను ఎంపిక చేసి, వాటిని 4 గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహిస్తారని తెలిపారు. పోటీలు రాత్రిల్లో కొనసాగడానికి ఫ్లడ్ లైట్లను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు మొదటి బహుమతి రూ. 30 వేలు, రెండో బహుమతి రూ. 20 వేలు, మూడో బహుమతి రెండు జట్లకు రూ. 10 వేల చొప్పున అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్ పాల్గొన్నారు.