పీరీల పండుగ అనగానే ఉమ్మడి జిల్లాలో ముందుగా గుర్తుకు వచ్చేది గండివేట్ గ్రామంలోని కాశీందులా సవారీ మాత్రమే. ఊరు ఊరంతా కలిసి కులమతాలకు అతీతంగా పీరీల పండుగను ఘనంగా జరుపుకోవడంతోపాటు మతసామరస్యాన్ని చాటడం గండివేట్ కాశీందులా సవారీ ప్రత్యేకత. నేడు(శనివారం) కాశీందులా సవారీ సందర్భంగా ప్రత్యేక కథనం.
గాంధారి, ఆగస్టు 5 :
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో పీరీల పండుగను ఉమ్మడి జిలాల్లో మరెక్కడా లేని విధంగా గ్రామస్తులంతా కలిసి ఘనంగా జరుపుకొంటారు. మొహర్రం నెల వచ్చిందంటే చాలు ఈ ఊర్లో వారంతా కులం, మతం అనే తేడా లేకుండా భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ఉంటారు. గండివేట్లోని ఆశీర్ఖానలో కొలువై ఉన్న కాశీందులాను కోరిన కోరికలు తీర్చే దేవుడిగా, కష్టాలను దూరం చేసే దైవంగా ఆరాధిస్తారు. గ్రామంతో అనుబంధం ఉన్న వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా మొహర్రం నెలలో జరిగే కాశీందులా సవారీని చూసేందుకు వస్తారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే భక్తులు కాశీందులాకు మొక్కులు చెల్లించుకొని కందూర్లు చేయడం ప్రారంభిస్తారు. కాశీందులా పీరీల సవారీని చూసేందుకు మండలవాసులతోపాటు చుట్టుపక్కల మండలాలు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
కాశీందులా పీరీ చరిత్ర..
పూర్వం ఐలాపూర్ గ్రామానికి చెందిన అవుసుల కుటుంబాల వారు పీరీలను తయారు చేసి వాటిని మహారాష్ట్ర, కర్ణాటక వంటి దూరప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించేవారు. ఈ క్రమంలో వారు తయారు చేసిన లాల్సాబ్, కాశీందులా పీరీలను తీసుకొని మహారాష్ట్రలోని దెగ్లూర్కు అమ్మడానికి వెళ్లారు. అక్కడ కేవలం లాల్సాబ్ పీరీ మాత్రమే అమ్ముడుపోయింది. అమ్ముడుపోని కాశీందులా పీరీని తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. గండివేట్ గ్రామ శివారుకు వచ్చేసరికి అవుసుల వారికి ఆకలి వేయడంతో వంట చేసుకునేందుకు నీటిని తీసుకురావడం కోసం ఒకరు తన వద్ద ఉన్న కాశీందులా పీరీని ఇంకొకరికి అప్పగించి, ఆ పీరీని నేలపైన పెట్టొద్దని, కింద దించితే పైకి లేవదని చెప్పి చెరువుకు వెళ్తాడు. కాశీందులా పీరీని పట్టుకున్న వ్యక్తి మరిచిపోయి కాశీందులా పీరీని చెరువు తూముకు ఆనిచ్చి నేలపై పెడతాడు. నేలపై పెట్టిన పీరీని ఎంతమంది పట్టి కదిలించినా కదలలేదు. ఈ విషయం గండివేట్ గ్రామంలోని పటేండ్ల కుటుంబానికి తెలిసింది. నేలపైన ఆనిచ్చిన కాశీందులా పీరీని పైకి లేపి తీసుకెళ్లడం కష్టంగా భావించిన అవుసలివారు, ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన గ్రామ పటేల్కు పీరీని కొనుగోలు చేయాలని బతిమిలాడారు. గ్రామ పటేల్ సొంత డబ్బులతో కాశీందులా పీరీలను కొనుగోలు చేశాడని..అప్పటి నుంచి కాశీందులా పీరీని అక్కడే ప్రతిష్ఠించారని గ్రామస్తులు చెబుతారు.
గండివేట్లో పీరీల సవారీ జరిగే విధానం
మొహర్రం నెలలో నెలవంక కనబడిన మరుసటి రోజున గ్రామంలోని ఆశీర్ఖానలో కాశీందులా పీరీతోపాటు అబ్బాస్ అలీ, మౌలాలీ, హుస్సేన్, బీబీ ఫాతీమా(దూది పీరీ)లను గ్రామంలో ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి పీరీలకు రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐదో రోజు తర్వాత రోజుకో పీరీ చొప్పున గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. మొదట అబ్బాస్అలీ పీరీ సవారీ నిర్వహిస్తారు. ఆ రోజు చిన్న పిల్లలకు, పెండ్లికాని వారికి రెండు నాడలను ఇస్తారు. నాడలను కట్టుకొని ఐదుగురి ఇండ్ల నుంచి బియ్యం తీసుకువచ్చి దాంతో కిచిడీ వండి పంచి పెడుతారు. తర్వాత మౌలాలి పీరీని ఊరేగిస్తారు. ఈ రోజు షర్బత్ చేసి అందరికీ పంచి పెడుతారు. అనంతరం హసేన్, హుస్సేన్ పీరీలను, ఆ తర్వాత బీబీ ఫాతిమా పీరీని పూర్తిగా దూదితో తయారుచేసి ఊరేగింపు నిర్వహిస్తారు.
ప్రత్యేకం.. సవారీ
గండివేట్ గ్రామంలో కొలువుదీరిన అన్ని పీరీల సవారీ కన్న కాశీందులా సవారీ ప్రత్యేకంగా ఉంటుంది. భక్తులు కాశీందులాకు మొక్కులు చెల్లించుకొని అర్ధరాత్రి జరిగే సవారీని వీక్షిస్తారు. సవారీ రోజున గ్రామంలో అగ్ని గుండాలు వేస్తారు. ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు అసయ్ దులా ఆటను ఆడతారు. నేడు(శనివారం) కాశీందులా సవారీ ఉండడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు.
కాశీందులా పీరీ చోరీ.. ఇరు గ్రామాల మధ్య గొడవ..
పూర్వం గండివేట్ గ్రామంలోని ఆశీర్ఖానలో కొలువైఉన్న కాశీందులా పీరీని దొంగలు ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. పీరీలను ఎత్తుకెళ్లిన దొంగలు వెలుట్ల శివారులోని అడవిలో వదిలిపెట్టి చనిపోయినట్లు తెలిపారు. వెలుట్ల శివారులో దొంగలు వదిలిన పీరీ తమదంటే తమదని వెలుట్ల, గండివేట్ గ్రామస్తులు గొడవపడ్డారని, చివరకు ఇరు గ్రామాల వారు ఒప్పందానికి వచ్చి కాశీందులా పీరీని ఏ గ్రామస్తులు పైకి ఎత్తితే ఆ గ్రామానికి ఆ పీరీ చెందుతుందని నిర్ణయించారు. అయితే కాశీందులా పీరీని పైకి ఎత్తడం వెలుట్ల గ్రామస్తులకు సాధ్యం కాలేదని, గండివేట్ గ్రామస్తులు కాశీందులా పీరీకి ప్రత్యేక పూజలు చేసి పైకెత్తి ఆ పీరీని తీసుకువచ్చి తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించినట్లు గ్రామస్తులు చెబుతారు.
ప్రతి ఇంట్లో కాశీరాం…
గండివేట్ గ్రామంలోని ఆశీర్ఖానలో కొలువై ఉన్న కాశీందులాపై భక్తితో గ్రామస్తులు, కులమతాలకు అతీతంగా తమ కుటుంబంలో ఒక్కరికైనా దేవుడిపేరు పెట్టుకొని మతసామరస్యాన్ని చాటుతున్నారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా కాశీందులా పేరు వచ్చేలా కాశీరాం, కాశీం, కాశవ్వ, కాశీనాథ్, కాశయ్య, కాశమ్మ, క్రాంతి తదితర పేర్లు ఉంటాయి.
పశు పక్ష్యాదులు ఆకలి తీర్చుకోవడానికి చెట్టు, పుట్టలను ఆశ్రయిస్తాయి. ధాన్యం గింజల కోసం ఎక్కడెక్కడో విహరిస్తాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు నిల్వ ఉండడంతో..వేల సంఖ్యలో పావురాలు తరలివస్తున్నాయి. ధాన్యం కోసం మార్కెట్ యార్డు షెడ్డుపై వాలి కడుపునింపుకొంటున్నాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్