నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 25: సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని సామాజిక మార్పు, అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, రోటరీ క్లబ్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన లీగల్ మాడ్యూల్ క్యాంప్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, అవసరమైనవారికి న్యాయసేవలు అందించాలనే సుప్రీం తీర్పును అమలుచేస్తున్నామని తెలిపారు.
జాతీయ లోక్అదాలత్ ద్వారా వేలాది వివాదాలను రాజీ పద్ధతిలో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ లాంటి సామాజిక దృక్పథం ఉన్నవారి సహకారంతో వందలాది మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేయడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ జైలు ఖైదీ రాసిన ఉత్తరాన్ని ప్రామాణికంగా తీసుకుని అందులో పేర్కొన్న సమస్యలను పరిష్కరించినట్లు గుర్తుచేశారు. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.నవీన్రావు మాట్లాడుతూ.. రోటరీ సేవలను కొనియాడారు. అసంఘటిత రంగంలోని కార్మికుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచిస్తూ న్యాయసేవా సంస్థ కూడా తోడుగా ఉంటుందని వెల్లడించారు. వీలైనన్ని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలన్నారు.
సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధ ప్రసంగిస్తూ.. అదనపు జిల్లా జడ్జిగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నిజామాబాద్ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. మహిళలపై హింసను అరికట్టాలని సూచించారు. హక్కులు, బాధ్యతలు, విలువలపై యువత అవగాహన పెంచుకోవాలన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అత్యున్నత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక కార్యక్రమం.. కొత్త కలెక్టరేట్కు మరింత వన్నె తెచ్చిందన్నారు. న్యాయవ్యవస్థతో జిల్లా యంత్రాంగం కలిసి పయనిస్తున్నదని, అంతిమంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిద్దామని అన్నారు. న్యాయసేవా సంస్థ కార్యక్రమాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల వివరించారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, రోడ్డు ప్రమాద బాధితులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు చెక్కులను అందజేశారు. అంతకుముందు చిందు కళాకారుల పద్మావతీ విలాసం ప్రదర్శన ఆకట్టుకున్నది.
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అదనపు జిల్లా జడ్జి పంచాక్షరి వ్యవహరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీశ్ షా, అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస రావు, షౌకత్ జహాన్, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీకాంత్ బాబు, పద్మావతి, జూనియర్ సివిల్ జడ్జిలు భవ్య, సౌందర్య, గిరిజ, సంస్థ ప్యానల్ న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, బట్టు మాణిక్ రాజు, ఆశ నారాయణ, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
స్వాగతం పలికిన కామారెడ్డి జిల్లా అధికారులు
విద్యానగర్, సెప్టెంబర్ 25 : హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్, హైకోర్టు జడ్జి నవీన్రావుకు కామారెడ్డి జిల్లా అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద వారికి కలెక్టర్ జితేశ్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం హైకోర్టు చీఫ్ జస్టిస్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.