నిజాంసాగర్, డిసెంబర్ 23: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రిచేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రవేశ పెట్టిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కిట్ను వాడితే తల్లి ఆరోగ్యంగా ఉండడంతో పాటు బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ యశోదా నీలూపటేల్, నాయకులు సాయాగౌడ్, మాధవ్రావు దేశాయ్, గంగాధర్, రాములు, డాక్టర్ ప్రశాంత్ పాల్గొన్నారు.