ఆర్మూర్, ఆగస్టు 30: సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు, నందిపేట మండలం వెల్మల్ గ్రామ గంగపుత్ర సంఘం ప్రతినిధులు, మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన వడ్డెర కులస్తులు, ఆలూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన రజక సంఘం ప్రతినిధులు, చిన్నయానం గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి.. అంకాపూర్లోని తన నివాసం వద్ద బుధవారం గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలంతా సారు.. కారు.. కేసీఆర్వైపే ఉన్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. సమైక్య పాలనలో వివక్షకు గురైన తెలంగాణ.. స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి జరగని గ్రామం లేదని, సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదన్నారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, బద్దం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి గుట్ట పుణ్యక్షేత్నాన్ని ఆర్మూర్ ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న నియోజకవర్గంలోని గ్రామాల ప్రజల కోసం ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేశారు. నందిపేట మండలం వన్నెల్ (కే) గ్రామస్తులు బుధవారం యాదాద్రికి బస్సులో తరలివెళ్లారు. ముందుగా ఆర్మూర్లోని సిద్దులగుట్టను దర్శనం చేయించారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి జీవన్రెడ్డి స్వయంగా వడ్డించారు. ఆనంతరం జెండా ఊపి బస్సును యాదాద్రికి పంపారు.