Kotagiri | కోటగిరి, జూలై 16 : వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల పాటు జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు రాజేశ్వర్ జోషి, శివాలయం ప్రధాన అర్చకులు దత్తాత్రి కులకర్ణి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లి లో గల ముక్తేశ్వర శివాలయంలో గ్రామస్తుల సహకారంతో భక్తులు, మహిళా భక్తులు శివాలయంలో గురువారం ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అనంతరం గంగాజలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ ప్రతి ప్రాణికి నీళ్లు ఆధారం కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ పరమేశ్వరుడిని కోరుతూ ఈ మూడు రోజుల పాటు జలాభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి జ్యోషితో పాటు శివాలయం అర్చకులు దత్తాత్రేయ కులకర్ణి, అనిల్ కులకర్ణి, సిద్దూ, నూకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.