గాంధారి, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. ఆదివారం మండల కేంద్రం నుంచి చద్మల్ తండా మీదుగా ఒక బస్సు, దుర్గం గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రెండు బస్సులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడారు. కొవిడ్ ప్రభావంతో నష్టాల్లోకి వెళ్లిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో సంస్థ తీవ్ర నష్టాల పాలైందని చెప్పారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడుతోపాటు పలు రాష్ర్టాలు బస్సు చార్జీలను పెంచినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో పెంచలేదన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ. మూడు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాంధారి నుంచి చద్మల్ తండా, దుర్గం, బీర్మల్ తండా మీదుగా వెళ్లే బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చద్మల్ నుంచి మంచిప్ప గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిహర హీరోహోండా షోరూంను ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి:ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం సుధా పరిమళ, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, తహసీల్దార్ గో వర్ధన్, సర్పంచ్ సంజీవ్, గాంధారి విండో చైర్మన్ సాయికుమార్, వైస్ ఎంపీపీ భజన్లాల్, ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తాన్సింగ్, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.