కామారెడ్డి, ఫిబ్రవరి 23: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట్)లో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 24 నుంచి మార్చి 12న సాయంత్రం 5 గంటల వరకు అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు 2017 జూన్ 1 నుంచి 2018 మే 31 మధ్యన జన్మించి ఉండాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం అర్బన్ ఏరియాలో రూ. 2 లక్షలు, రూరల్లో రూ.1.50 లక్షలు మించి ఉండరాదని పేర్కొన్నారు. మార్చి 15న జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.