International Mother Language Day | మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. అమ్మ మాటే మాతృభాష. ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
కామారెడ్డి, ఫిబ్రవరి 20 : మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష. మనిషి పుట్టగానే తల్లి ఒడిలో నేర్చుకునే పదాలే మాతృభాష. అవి మనిషికి ఎంతో విలువైనవి. అమ్మ పలుకులోని ఆప్యాయత అనురాగం మరెక్కడా దొరకవు. మనిషి తాను ప్రపంచంలో అన్ని చోట్ల జయించాలంటే తన మాతృభాషను గౌరవించాలి.
మనస్సులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషలో ఉంది. అందుకే మహనీయులు అందరూ మాతృభాషను తొలుత నేర్చుకొన్నవారే.. నేడు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరభాషల వెంట పరుగులు తీస్తున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే కానీ ఆ నెపంతో మాతృభాషను చిన్న చూపు చూడరాదు అని పలువురు తెలుగు సాహితీ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాల్యం నుంచి మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, అప్పుడే మనిషి సంపూర్ణతను సాధిస్తాడని భాషాభిమానులు, సాహితీవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి తన మాతృభాషలో మాట్లాడినపుడు సంతృప్తి చెందుతారు.
1956లో తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృ భాష అయిన బెంగాలీలో పాఠ్యాంశాలు బోధించాలని ఉద్యమించారు. ఫలితంగా హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారు. మాతృ భాష కోసం చేసిన త్యాగం ఫలితంగా 1999 ఫిబ్రవరి 21 నుంచి ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఆ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రపంచంలో మొత్తం ఆరు వేల భాషలు ఉండగా, భారత దేశంలో 1,652 మాతృభాషలు ఉన్నాయి. వీటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. 200 భాషలకు 1600 పైగా మాండలికాలున్నాయి. మాతృభాష అంతరించి పోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో మాతృభాష అంతర్భాగమని నిర్వహించింది. కనీసం 30 శాతం మంది పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే మాతృభాష ఉనికికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 57 అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు ఉన్న తెలుగు ..ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్ద మాతృభాషగా మన్ననలు పొందుతుంది. హిందీ తరువాత తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురి పండితుల అభిప్రాయాలు..
మాతృభాష చాలా మధురమైంది. మనిషి మొదటగా తల్లి ఒడిలోనే మాతృభాషను నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ మాతృభాషలోనే మాట్లాడాలి. మాతృభాషలో మాట్లాడడం వలన మనస్సులోని భావాలు స్పష్టంగా అర్థమవుతాయి. సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు భాషకు పట్టం కట్టారు.
– డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ, ప్రముఖ కవి, రచయిత
మాతృభాష అభిమానం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ప్రతి తల్లి దండ్రులు తెలుగు భాషను, వారి మాతృ భాషను ప్రోత్సహించాలి. తెలుగు నేర్పడం చిన్న తనంగా భావించకూడదు. కనీసం పాఠశాల విద్య వరకు తెలుగు తప్పనిసరిగా చేసి పోటీ పరీక్షల్లో ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.
–వైద్య శేషారావు , ప్రముఖ కవి
మాతృభాషలో విద్యాబోధనతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మాతృ భాష తెలుగు కమ్మనైనది. బిడ్డకు అమ్మపలుకే కమ్మగా ఉంటుంది.అందుకే అమ్మ భాష తీయగా ఉంటుంది. ఉపాధ్యాయుడిగా, వ్యాఖ్యాతగా పని చేస్తూ మాతృ భాష పైన మక్కువ పెంచుకొని పుస్తకాలు రచించాను.
– అంబీర్ మనోహర్ రావు, తెలుగు ఉపాధ్యాయుడు