కోటగిరి, మే20: ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు, వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు, ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్కుతూ నడవాలి ఇదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని గిరిజన తండాల పరిస్థితి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. తండాలు స్వయం పాలనకు వేదికయ్యాయి. ప్రతి ఇంటినీ మిషన్ భగీరథ పలకరిస్తోంది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఊరిబయట వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు వచ్చాయి. తండా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో తండాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కలలో కూడా ఊహించని ఈ మార్పు వెనుక ఉన్నది సీఎం కేసీఆర్, ఏనాడు చూడని సింగారాలు సంతరించుకుని స్వయం పాలనతో ప్రగతిపథాన దూసుకుపోతున్నాయి. 2008 ఏప్రిల్ 11వ తేదీన నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేసిన ప్రతిజ్ఞ ఫలితం నేడు ప్రతి తండాలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ‘ఆపన్ తండేమ ఆపనో రాజ్’ పేరిట మన తండాలో మనరాజ్యం రావాలని కోరిన గిరిజనులకు ఆనాడు అభయమిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత వారి కలను సాకారం చేశారు. ఒకనాడు ప్రధాన గ్రామ పంచాయతీకి అనుసంధా పల్లెలుగా ఉండి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తండాలు నేడు సకల సౌకర్యాలతో గ్రామ పంచాయతీలుగా వర్ధిల్లుతున్నాయి.
వికసిస్తున్న తండాలు..
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు పంచాయతీలుగా మారిన తరువాత అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. పంచాయతీలుగా మారిన 71 తండాలలో నేడు గిరిజనులే సర్పంచులయ్యారు. సుమారు 600 మంది వరకు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా గిరిజనులే ఎన్నికై స్వపరిపాలన చేసుకుంటున్నారు.
తండాల్లో అభివృద్ధి పనులు..
గతంలో తండాలకు నిధులు వచ్చేవి కాదు. ప్రధాన గ్రామ పంచాయతీల్లోని పనులకే ప్రాధాన్యమిచ్చేవారు. శివారు గ్రామాలుగా ఉన్న తండాల అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. తండాలు పంచాయతీలుగా మారిన తరువాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, ఒక్కో పంచాయతీకి ట్రాక్టర్ సహా అనేక వనరులు సమకూరాయి. వీటి కోసం ప్రభుత్వం ప్రతి తండాకు ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు మంజూరు చేసింది. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తండాల ప్రజలు తాగునీటికి నానా అవస్థలు పడేవారు. నేడు మిషన్ భగీరథ పుణ్యమా అని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది.
జల్లాపల్లి అబాదిలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు..
గ్రామంలో రూ. 45 లక్షల నిధులతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో సేవాలాల్ మందిరం, రూ. 2 కోట్లతో 40 మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, రూ. 15లక్షలతో సీసీ మురుగు కాల్వలు నిర్మాణం, రూ. 16లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ. 4 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ అదనపు పనులు, రూ. 3 లక్షలతో కల్వర్టు పనులు, రూ. 3లక్షలతో పంచాయతీ వద్ద గ్రావెల్ పనులు, రూ. 15లక్షల నిధులతో జనరల్ ఫంక్షన్ హాల్, రూ.10 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ. 5 లక్షలతో పాత గ్రామంలో హనుమాన్ మందిరం ప్రహరీ, రూ.7 లక్షలతో దుర్గామాత మందారానికి నిధులు, రూ. 3లక్షలతో మైనార్టీ ఈద్గా రోడ్డు, రూ. 10లక్షలతో సేవాలాల్ ప్రహరీ, రూ. 5 లక్షలతో హనుమాన్ మందిరం, రూ. 6లక్షలతో మైనార్టీ మజీద్ పనులు, రూ. 10లక్షల నిధులతో స్కూల్ ప్రహరీ, రూ. 7లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు మొరం రోడ్డు, రూ. 20 లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టారు.
కేసీఆర్ సారు వచ్చాకే తండాలో రోడ్లు..
సీఎం కేసీఆర్ సారు వచ్చాకే మా తండాలో సీసీ రోడ్లు వేశారు. గల్లీ గల్లీకి రోడ్లు ఐనయ్.. గింతకు ముందు మా గల్లీల వాన అస్తే నడవడానికి రాకుండే.. అంత బురద ఉంటుండే.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సారు పుణ్యమా అని మాతండాకు వచ్చి మేము పడుతున్న కష్టాలను చూసి నిధులు మంజూరు చేసిండు.. అప్పటి నుంచి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటింటికీ నల్ల పెట్టించిండ్రు పోచారం సారూ..
– అన్సాబాయి, జల్లాపల్లి అబాది
పంచాయతీగా మారినంకే అభివృద్ధి..
మా తండా ఇంతకు ముందు జల్లాపల్లిఫారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరువాతే జల్లాపల్లి అబాది తండాలో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే మా తండాలో అభివృద్ధి పనులకు నిధులు, గ్రామ పంచాయతీ భవనం, అర్హులైన 40 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి.
–బర్మవత్ వివేక్, సర్పంచ్ జల్లాపల్లి అబాది