ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు, నామినల్ రోల్స్ స్కూళ్లకు చేరుకోగా.. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులను సంప్రదించి హాల్ టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే www.bse. telangana.gov.in వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకు ముందు 11 పేపర్లకు పరీక్షలు జరిగితే.. ఈ సారి 6 పేపర్లే ఉండనున్నాయి. పరీక్షలపై సందేహాలను నివృత్తి చేసేందుకు కామారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ (7661854856)ను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు..
మాస్ కాపీయింగ్ జరగకుండా రాష్ట్ర విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి కేంద్రంలో ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. సీల్ చేసిన ప్రశ్నాపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్ గదిలో ఓపెన్ చేస్తున్నప్పుడు రికార్డు చేయనున్నారు. నలుగురు ప్లయింగ్ స్కాడ్స్,15 మంది సిట్టింగ్ స్కాడ్స్, 595 మంది ఇన్విజిలేటర్లు, 63 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 63 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్, ఇద్దరు అడిషనల్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్స్, 22 మంది జాయింట్ కస్టోడియన్ ఆఫీసర్స్తోపాటు కలెక్టర్, జేసీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. రెవెన్యూ, పోలీస్, వైద్య విభాగం సిబ్బంది కూడా పరీక్ష విధులో ఉంటారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 33,663 మంది విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 33,663మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 11,899 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5,902 మంది బాలురు, 5,997 మంది బాలికలు ఉన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,764 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 11,042 మంది బాలురు, 10,722 మంది బాలికలు ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ జరుగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.
-నీలం లింగం, పరీక్షల విభాగం అధికారి, కామారెడ్డి జిల్లా