Nizamabad | వినాయక నగర్, జూన్14 : నిజామాబాద్ పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎహెచ్వో శ్రీనివాస్, నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి నగర శివారులోని కంఠేశ్వర బైపాస్ రోడ్డులో గల డీ మార్ట్ సూపర్ మార్కెట్ లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీ మార్ట్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు పైపులు, సీస్ ఫైర్ (అగ్ని ప్రమాదం సంబంధించినప్పుడు మంటలు ఆర్పేందుకు వినియోగించే ) వస్తువులను పరిశీలించారు. దీంతో పాటు ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన అత్యవసర ద్వారాన్ని పరిశీలించారు.
అనంతరం అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను అదుపు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డీమార్ట్ లో ఉన్న సిబ్బందికి వివరించారు. అలాగే చిన్నపాటి మంటలు చలరేగినప్పుడు వాటిని చుట్టూ పక్కల వ్యాపించకుండా ముందుగా అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని, అనంతరం సిబ్బంది వచ్చేవరకు మంటలను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డీమార్ట్ సిబ్బందికి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.