మెండోరా, జూలై 15: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్నది. మూడేండ్లుగా ప్రాజెక్టులోకి జూలై పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారింది. ఈ ఏడాది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, నిర్మల్, నిజామాబాద్, నవీపేట్, నందిపేట్, గడ్డెన్న వాగు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ప్రాజెక్ట్లోకి పదిరోజుల వరకు వరద జాడలేకుండా పోయింది. ఈ నెల 7వ తేదీన కాళేశ్వరం జలాలను వరద కాలువతో రివర్స్ పంపింగ్ చేసి ముప్కాల్ పంప్హౌస్ నుంచి ఎస్సారెస్పీ నింపడం ప్రారంభించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఇన్ఫ్లో రావడం మొదలైంది. గత బుధవారం నుంచి 38 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో అటు కాళేశ్వర జలాలు, ఇటు వరద వచ్చి చేరుతుండడంతో కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ, వరద కాలువ ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. కాళేశ్వర జలాలను అందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నవీపేట్, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి 16,818 క్యూసెక్కుల వరద రాగా మధ్యాహ్నం వరకు 38,250 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రానికి 27,810 క్యూసెక్కుల వరద తగ్గిపోయింది. ఒకేరోజు ప్రాజెక్ట్లో అడుగుకుపైగా నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1068.60 అడుగుల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. వర్షాల ద్వారా 4.823 టీఎంసీలు, ముప్కాల్ పంప్హౌస్ నుంచి కాలేశ్వర జలాలు 1.799 టీఎంసీలు వచ్చినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 6.622 టీఎంసీల వరద వచ్చి చేరింది.