నిజామాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్ : ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో బోధన్కు చెందిన మహేశ్కుమార్ సత్తా చాటాడు. పేదింటి బిడ్డ అయిన తను 200 ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మహేశ్.. ఆరో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అలాగే, ఇందూరు కోడలు దీప్తి చౌహాన్ 630 ర్యాంక్తో సాధించారు. డాక్టర్ వృత్తిని వదులుకొని మరీ తీవ్రంగా శ్రమించిన ఆమె.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సివిల్స్లో ర్యాంకులు సాధించారు. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన కంఠం మహేశ్కుమార్ 200వ ర్యాంకు, నిజామాబాద్ నగరానికి చెందిన దీప్తి చౌహాన్ 630వ ర్యాంకుతో ప్రతిభ చాటారు. ఆరో ప్రయత్నంలో 200వ ర్యాంకు బోధన్ పట్టణానికి చెందిన కంఠం మహేశ్కుమార్ ఆరో ప్రయత్నంలో 200వ ర్యాంకు సాధించారు. సివిల్స్ మెయిన్స్లో పొలిటికల్ సైన్స్ను ఆప్షనల్గా ఎంపికచేసుకున్నారు. మహేశ్ తండ్రి రాములు విద్యుత్శాఖలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా వేల్పూర్లో పనిచేస్తున్నారు. తల్లి యాదమ్మ హెల్త్ సూపర్వైజర్గా బోధన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఎస్సెస్సీ వరకు చదివారు. ఇంటర్ నిజామాబాద్లో, డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీలోని జేఎన్టీయూ నుంచి రాజనీతిశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీలో సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తనకు పదేండ్లుగా పరిచయం ఉన్న తోట సౌమ్యను గత డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. సౌమ్య ప్రస్తుతం ఫెర్నాండెజ్ ఫౌండేషన్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా పనిచేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే..
ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే సివిల్ సర్వీసెస్ను ఎంపికచేసుకున్నా. మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. చిన్నప్పటి నుంచి చుట్టూ జరుగుతున్న పరిణామాలు, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవడంతోనే ఈ విజయం సాధ్యమైంది. సివిల్ సర్వీసెస్లో ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు ఆప్షన్ ఇచ్చాను. ఐఎఫ్ఎస్గా పనిచేయడం చాలెంజ్గా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, సామాన్య ప్రజల జీవనాన్ని ప్రభావితం చేసే అంశాలకు ఎంతో సంబంధం ఉంటుంది. నా తల్లిదండ్రులతోపాటు నా భార్యకూడా ఎంతో ప్రోత్సాహించింది.
–మహేశ్కుమార్
మా కల నెరవేరింది..
మా కుమారుడు మహేశ్కుమార్ను అత్యున్నత స్థానంలో చూడాలనే కల నెరవేరింది. చిన్నప్పటి నుంచి మహేశ్ చదువులో చురుగ్గా ఉండేవాడు. కష్టపడి సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించడం గర్వంగా ఉంది.
–యాదమ్మ, రాములు, మహేశ్ తల్లిదండ్రులు
ఇందూరు కోడలికి 630వ ర్యాంకు..
నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ దీప్తి చౌహాన్ 630 ర్యాంకు సాధించారు. వరుసగా మూడుసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించగా చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత కొద్దికాలంగా డాక్టర్గా పని చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లాకు చెందిన మేనబావ డాక్టర్ కె.ప్రవీణ్ను 2019లో వివాహం చేసుకున్నారు. దీప్తి అమ్మమ్మ స్వస్థలం నిజామాబాద్. ఆర్డీవోగా పని చేసిన కె.వెంకటయ్య వీరి మేనమామ. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అత్తామామలు, భర్త తోడ్పాటుతో సివిల్స్కు ప్రిపేర్ అయినట్లు దీప్తి చెప్పారు. లక్షలాది మంది ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కుటుంబీకులు అడుగడుగునా అందించిన ప్రోత్సాహం తనకెంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. తనకు ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా దీప్తి పేర్కొన్నారు.
నాలుగేండ్ల ప్రయత్నం ఫలించింది..
పేద ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే సివిల్స్కు సన్నద్ధం అయ్యాను. మా మామ వెంకటయ్య రిటైర్డ్ ఆర్డీవో కావడంతో సేవ చేయాలనే ప్రభావం నాపై పడింది. ఇందుకు నా భర్త నుంచి ప్రోత్సాహం కూడా లభించింది. వివాహమైన అనంతరం నాలుగేండ్లుగా సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. వరుసగా రెండు సార్లు విఫలమైనప్పటికీ మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించడం చాలా సంతోషంగా ఉంది.
–దీప్తి చౌహాన్
చాలా ఆనందంగా ఉంది..
మా కోడలు ఎన్నటికైనా సివిల్స్ లో ర్యాంకు సాధిస్తుందనే నమ్మకం ఉండేది. లక్ష్యం మేరకు దీప్తి చౌహాన్ తన గమ్యాన్ని చేరుకోవడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇష్టమైన వైద్య రంగాన్ని వదిలి ప్రజా సేవ కోసమే సివిల్స్ వైపు అడుగు వేశారు.
– కె.వెంకటయ్య, రిటైర్డ్ ఆర్డీవో,దీప్తి చౌహాన్ మామయ్య