DOST | డిచ్పల్లి, జూన్ 24: డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్)కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తికాగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. మొదటి విడుతలో తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ప్రధానంగా అటానమస్ ఉన్న వాటిలోనే విద్యార్థులు చేరేందుకు సుముఖత చూపారు. దాదాపు 70శాతం విద్యార్థులు అటానమస్ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకే ప్రాధాన్యమిచ్చారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 14శాతం మంది విద్యార్థులు చేరారు. అటానమస్ ఉన్న ప్రైవేటు కళాశాలలకు కాస్త ఆదరణ పెరిగింది. రెండో విడుత దోస్త్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 26వ తేదీ వరకు రెండో విడుతకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత 27 వరకు వెబ్ ఆప్షన్లు, 30వ తేదీన సీట్ల అలాట్మెంట్ చేయనున్నారు.
ప్రవేశాల ప్రక్రియ ఇలా..
రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒకే విధానాన్ని అనుసరిస్తున్నది. దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నది. ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత మే16 నుంచి జూన్ 10వ తేదీ వరకు దోస్త్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. జూన్ 11 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఇదే నెల 16వ తేదీన మొదటి విడుత సీట్ల అలాట్మెంట్ జరిగింది. ప్రస్తుతం రెండో విడుత ప్రక్రియ కొనసాగుతున్నది. మూడో విడుత జూలై 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తుతోపాటు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 10వ తేదీన సీట్ల అలాట్మెంట్ చేసి, 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
అటానమస్ కళాశాలలకే మొగ్గు..
విద్యార్థులు ప్రధానంగా అటానమస్ ఉన్న కళాశాలలకే మొగ్గు చూపుతున్నారనడానికి ప్రధాన కారణం అక్కడ నాణ్యమైన విద్య అందడమే. దీంతోపాటు ఆయా కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, పుస్తకాల లభ్యత, ల్యాబ్లు, నిర్వహణ వంటి అంశాల్లో ఆయా కళాశాలలకే పూర్తి హక్కు ఉంటుంది. ఈ కారణంగా విద్యార్థులు అధికంగా అటానమస్ కళాశాలలకు ప్రాధాన్యమిచ్చారనేది స్పష్టమవుతున్నది. ప్రభుత్వ కళాశాలలు కూడా ప్రైవేటుకు దీటుగా విద్యనందిస్తున్నాయని అనడానికి దోస్త్ సీట్ల అలాట్మెంట్ లెక్కలే నిదర్శనం.
టీయూ పరిధిలో సీట్లు..
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 64 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8 ప్రభుత్వ, 2 ప్రభుత్వ అటానమస్, 53 ప్రైవేటు, 1 ప్రైవేటు అటానమస్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 28,800 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 506 సీట్లు, ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో 1604, ప్రైవేటు కళాశాలల్లో 3063, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లో 325 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 5498 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో అత్యధికంగా 70 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 12 శాతం, ప్రైవేటు కళాశాలలో 14.02 శాతం ఉండగా ప్రైవేటు అటానమస్ కళాశాలల్లో మాత్రం 42 శాతం విద్యార్థులు చేరినట్లు దోస్త్ లెక్కలు చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే డిగ్రీలో చేరే విద్యార్థులు దాదాపు అటానమస్ కళాశాలల్లోనే చేరారని స్పష్టమవుతున్నది.