ఖలీల్వాడి/నిజామాబాద్ కల్చరల్, అక్టోబర్ 1 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం బిగాల కృష్ణమూర్తి భవనాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పని చేస్తుందని అన్నారు. ఆర్యవైశ్యులు విరివిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఆర్యవైశ్యుల్లోనూ పేదలు ఉన్నారని వారికి కల్యాణ లక్ష్మి అందజేస్తున్నామన్నారు. ఆర్యవైశ్య సంఘానికి రూ. కోటీ 50 లక్షలు ప్రభుత్వం తరఫున మంజూరు చేశామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా రూ. 75 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. నగర అభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే చాలా కష్టపడుతున్నారని.. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. దానగుణం ఉన్న వ్యక్తి గణేశ్ కావున అందరూ అండగా ఉండాలన్నారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. అభివృద్ధికి పాటుపడేవారిని ఆదరించాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సోదర సోదరీమణులను అభినందించారు. నగరంలోన కిషన్ గంజ్లో దాదాపు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించాలని సంకల్పించి.. కవితక్కతో నిధుల కోసం చర్చించగానే ఒక్క క్షణం ఆలోచించకుండా రూ.కోటీ 50 లక్షలు మంజూరు చేశారని, తమ తండ్రి బిగాల కృష్ణమూర్తి మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకార్థం రూ.75 లక్షలు విరాళంగా ఇచ్చామన్నారు. అదే విధంగా నగరంలోని వివిధ ఆర్యవైశ్య సంఘాలకు రూ. 5 లక్షల చొప్పున రూ.60 లక్షలు మంజూరు చేశామన్నారు. ఆర్యవైశ్య వసతిగృహం నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశామని, ఒక్క ఆర్యవైశ్య సంఘానికి కాకుండా నగరంలోని అన్ని కులసంఘాలు, మతాల వారికి భవనం నిర్మించుకోవడానికి నిధులు మంజూరు కేటాయించామన్నారు. మరోవైపు అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణగుప్తా, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కొత్తకోట ఎంపీపీ మౌనిక, రేణికుంట్ల గణేశ్గుప్తా, ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఆగిరి వెంకటేశ్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మోటూరి దయానంద్గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండవీర శేఖర్గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య కులస్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై వాసవి… జైజై వాసవి నామస్మరణతో ఆలయం మార్మోగింది. వాసవీ మాత జన్మ క్షేత్రమైన పెనుకొండ నుంచి వాసవి ఉత్సవమూర్తి, పాదుకలు తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన, గణపతి హోమం తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పెనుకొండ క్షేత్ర ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరి మణికంఠ శర్మ, వేలేటి గౌరీ శంకర శర్మ, ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.