నిజాంసాగర్, అక్టోబర్ 1: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా.. మూడు గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా అని పేర్కొన్నారు. మండలంలోని మహ్మద్నగర్ను ఇటీవల నూతన మండలంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన మండలాన్ని ఆదివారం కవిత ప్రారంభించారు. ముందుగా మహ్మద్నగర్కు చేరుకున్న ఆమెకు మండల ప్రజలు ఘనంగా బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం నూతన తహసీల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఇతర పార్టీల నాయకులు వట్టి మాటలు చెబుతారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆగం కావద్దని సూచించారు.
హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, కేసీఆర్ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి ఏవేవో మాటలు చెబుతారని అన్నారు. చెప్పేటోళ్లు ఎవరు, చేసేటోళ్లు ఎవరు గమనించాలని సూచించారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్నారు. యూరియా బస్తాల కోసం కష్టాలు పడే కాలం పోయిందన్నారు. అన్ని వర్గాల గురించి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
గతంలో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి కానీ ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం చూడలేదన్నారు. మానవత్వం ఉన్న మనిషి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అన్నారు. 24 గంటల విద్యుత్తు, రైతు బంధు, పింఛన్ వంటి అనేక పథకాలు మన రాష్ట్రంలోనే అమలుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లుగా ఉంటే అందులో పింఛన్లకే రూ.45వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త మండలం కల సాకారం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు కృషి ఎంతో ఉందని అన్నారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్తో మీ ఎమ్మెల్యే ప్రతిరోజూ చర్చించేవారన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభరాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీపీ పట్లోల్ల జ్యోతి దుర్గారెడ్డి, నాయకులు దుర్గారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.