ఆర్మూర్, ఆగస్టు 26: కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, బీజేపీ అబద్ధాల పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన మందచుక్క బోట్ల మున్నురు కాపు సంఘ సభ్యులు, శాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు వందలాది మంది జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో శనివారం చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని , కాంగ్రెస్, బీజేపీలు కిరాయి, పరాయి పార్టీలన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అభివృద్ధి , సంక్షేమమే బీఆర్ఎస్ అజెండా అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా , 24గంటల ఉచిత విద్యుత్, పెన్షన్లు, కేసీఆర్ కిట్, దళిత, మైనార్టీ, బీసీ బంధు, ఐటీ ప్రగతి తదితర పథకాలు, అంశాలు కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయాలని అన్నారు.ఈ పథకాలు తెలంగాణలోని సబ్బండ వర్గాల జీవనంలో సమూల మార్పులు తీసుకువచ్చాయన్నారు. అన్నివర్గాల ప్రజలు బీఆర్ఎస్ను సొంత పార్టీగా భావిస్తున్నారని తెలిపారు. గులాబీ కండువాలు కప్పుకుంటూ మళ్లీ కారు సారు కేసీఆర్ రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ దేవుడని పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్, అబద్ధాల బీజేపీపై వేటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.