మండుటెండలో.. తడారుతున్న గొంతులో.. కాసిన్ని చల్లని నీళ్లు పోస్తే బాగుండని అనుకోని బాటసారులు, పాదచారులు, ప్రయాణికులు ఉండరు. ఇలాంటి వారి కోసమే ‘మేమున్నాం’ అంటూ కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో కొందరు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ ఇచ్చిన పిలుపును ప్రభుత్వశాఖల అధికారులు కొందరు ఉత్సాహంగా అందుకుంటున్నారు. వీరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారంటే…
కోటగిరి, మే 22: వేసవిలో అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు బాటసారులకు, ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. వివిధ పనుల కోసం పల్లెల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు వస్తున్న వారికి దాతలు ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. పేదల ఆకలి తీర్చుతున్నాయి. తమకు ఉన్న దాంట్లోనే కొంత సొమ్ము వెచ్చించి ఈ కేంద్రాలను నిర్వహిస్తుండడం విశేషం.కోటగిరి గ్రామానికి చెందిన పోల విఠల్రావు గుప్తా నాలుగేండ్ల నుంచి పోల రాజమణి, పోల సోమశంకర్ జ్ఞాపకార్థం పోల రాఘవేంద్ర దీప్తీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటగిరిలో చలివేంద్రం, అంబలి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 2019 నుంచి ఏటా మార్చి నుంచి జూన్ వరకు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని సుద్దులం, బస్వాపూర్, సుద్తులంతండా, రాంపూర్,ఎక్లాస్పూర్, కొత్తపల్లి,ఎత్తొండ, వల్లభాపూర్, యాద్గార్పూర్తోపాటు వివిధ గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు, బాటసారులు అంబలి కేంద్రం వద్ద వచ్చి సేద తీరుతున్నారు. వేసవిలో రాగి అంబలి కేంద్రం నిర్వహించడం సంతృప్తినిస్తున్నదని పోల విఠల్రావుగుప్తా పేర్కొన్నారు.
కోటగిరి బస్టాండ్లో ఉండే వృద్ధులు, ప్రయాణికుల ఆకలి తీర్చి కడుపు నింపాలనే ఉద్దేశంతో అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని దాత పోల విఠల్రావుగుప్తా చెప్పారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు అంబలిని పంపిణీ చేస్తున్నారు. కాయపల్లి లక్ష్మణ్ తన ఇంటి వద్ద అంబలిని తయారు చేస్తున్నారు.
కోటగిరిలోని శ్రీ వివేకానంద హైస్కూల్, శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మిర్జాపూర్క్యాంప్ బస్టాండ్ వద్ద పదేండ్ల నుంచి ఏటా వేసవికాలంలో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. చలివేంద్రం ద్వారా బాటసారులు, ప్రయాణికులు, దవాఖానకు వచ్చే జనాల కోసం నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శుద్ధమైన నీటితోపాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
పొతంగల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శ్యామ చరణ్ ట్రేడర్స్ నిర్వాహకులు గంగంప్రశాంత్ గుప్తా 13ఏండ్ల నుంచి ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన నీటిని అందిస్తున్నారు. ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు, పాదచారుల దాహార్త్తిని తీరుస్తున్నారు.
కోటగిరి మండలం లింగాపూర్ బస్టాండ్ వద్ద సర్పంచ్ దేగం హన్మంతు ఆధర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి సహకారంతో నాలుగేండ్ల నుంచి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
రాజంపేట్, మే 22: వేసవిలో అద్భుతమైన ఆహారం అంబలి. గ్రామీణ ప్రజలు అంబలి తయారు చేసుకొని తాగుతుంటారు. అంతేకాదు.. అన్నంలో కూడా కలుపుకొని తింటారు. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా రాగి పిండితో అంబలిని తయారు చేస్తారు. ఒక్కోసారి ఇతర తృణ ధాన్యాల పిండిని కూడా వాడతారు. రాగిపిండితో జారుగా తయారు చేసుకొనే జావను అంబలి అని, రాగి జావ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంబలిలో మజ్జిగ కలుపుకొని తీసుకుంటే, వేసవి తీవ్రతను తట్టుకునే శక్తి వస్తుంది. అంబలి సర్వకాలాల్లోనూ తీసుకోదగినదే అయినా, వేసవిలో దీనిని తీసుకోవడం ఆరోగ్య రీత్యా చాలా అవసరం. రాగుల్లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో అంబలి ఒంటికి దివ్య ఔషధంలా పనికొస్తుంది.
ఈ సీజన్లో అంబలితో కాస్త మజ్జిగను కలుపుకొని తాగితే ఎండవేడిమితో ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. శరీరాన్ని చల్లబరుస్తుంది.అధిక బరువుతో బాధపడేవారు కాలంతో సంబంధం లేకుండా నిత్యం అంబలి తాగితే తొందరగా ఆకలి కాదు. బరువు తగ్గేందుకు అంబలి చక్కటి మార్గం. అంబలిని రెగ్యులర్గా తాగడంతో అలసట రాదు. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. మధుమేహం, స్థూలకాయం, బీపీ పేషంట్లకు ఇది చక్కటి మెడిసిన్లా పని చేస్తుంది. రాగి అంబలి తాగడంతో శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. వేసవికాలంలో వేడి చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు రాగి అంబలి తాగించడంతో చురుగ్గా ఉంటారు.