ఖలీల్వాడి/కామారెడ్డి/నిజామాబాద్ క్రైం, జూన్ 11 : ఉమ్మడి జిల్లాలో టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటింగ వరకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోని అనుమతించారు. సీసీ కెమెరాలు, పకడ్బందీ పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష కొనసాగింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. వివిధ సెంటర్లను కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ ప్రవీణ్కుమార్తోపాటు జిల్లా అధికారులు పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 12,861 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 7,957 (63%)మంది హాజరయ్యారని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు వెల్లడించారు. 4,904 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 4,549 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,013 (66.23%) మంది హాజరయ్యారని డీఈవో రాజు తెలిపారు. 1536 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. ఆదర్శ హిందీ విద్యాలయం, విశ్వశాంతి, నిశిత కళాశాల సెంటర్లను నిజామాబాద్ కలెక్టర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాందీపని, ఎస్ఆర్కే కళాశాల తదితర సెంటర్లను కామారెడ్డి కలెక్టర్ తనిఖీ చేశారు.