ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోల్లో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ పోయడానికే సరిపోతుందని, దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని, లేదంటే కుటుంబాలు వీధిన పడతాయని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఇందులో భాగంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం చేసేలా చర్యలు తీసుకున్నది. వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించింది. మొదటి వారం రోజులపాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. వారం తర్వాత మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.
జిల్లాలోని కామారెడ్డి డిపో నుంచి 12 వేలు, బాన్సువాడ నుంచి 5వేల మంది మహిళలు, మొత్తం సుమారు 17వేల మందికి పైగా బస్సుల్లో ప్రయాణిస్తారు. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వంపై రోజుకు రూ.15లక్షల వరకు భారం పడనున్నది. కామారెడ్డి డిపోలో పల్లె వెలుగు 95,ఎక్స్ప్రెస్ 50,బాన్సువాడలో పల్లె వెలుగు 35,ఎక్స్ప్రెస్ 15 బస్సులు ఉన్నాయి. నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆటోల్లో వెళ్లేవారు. ఈ పథకం అమలుతో ఆటోలకు బదులుగా బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో తమ జీవనోపాధిపై దెబ్బపడిందని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణ పథకం అమలు చేసి మా బతుకులను ఆగం చేసింది. గతంలో పట్టణంలో ఎక్కడికి వెళ్లినా, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లినా ఆటోలనే సంప్రదించేవారు. ఈ పథకం ప్రవేశపెట్టడంతో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతున్నది. బస్సులోనే ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మా కుటుంబాల పోషణ మొత్తం ఆటోపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఆందోళన చేస్తాం.
మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంతో జిల్లాలోని ప్యాసింజర్ ఆటోవాలాల పొట్టగొట్టింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 500పైగా ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఈ పథకం ప్రారంభించడంతో ప్రతి రోజు రద్దీగా ఉండే ఆటోలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతంలో ఆటోవాలాలు బస్సులకన్నా ఎక్కువ చార్జీలు తీసుకునే వారు, కానీ యూనియన్గా ఏర్పడిన తర్వాత బస్సు చార్జీలనే తీసుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్,పాత బస్టాండ్,నిజాంసాగర్ చౌరస్తా,సిరిసిల్లా రోడ్, జేపీఎన్ రోడ్డు, ఏరియా దవాఖాన, రైల్వేస్టేషన్ కూడలి వద్ద నుంచి కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోకి బస్సు చార్జీలతో వెళ్లేవారు. కానీ ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభించడంతో ప్రతి ఒక్కరూ ఆటోకు బదులుగా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో తమ బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదాయం పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు