మోర్తాడ్, ఏప్రిల్ 24: అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హెచ్చరించినా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలో రెండున్నరేండ్ల కాలంలో ఇసుకాసురులు వాగులను కొల్లగొడుతునే ఉన్నారు. గోదావరి నదిని సైతం వదలడం లేదంటే ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విషయం అర్థమవుతున్నది. ఇసుక అక్రమ రవాణా ఇక్కడి నుంచే కాకుండా జగిత్యాల జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు ఆరునెలలుగా అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు కాకుండా ఏకంగా దాదాపు మూడు టిప్పర్ల ఇసుక తీసుకువచ్చే టారస్ వాహనాల్లో ఇసుకను అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
అధికార పార్టీ నాయకులే ఇసుక దందా చేస్తుండడంతో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఒక అధికారి జగిత్యాల జిల్లాలో ఉండడంతో ఈజిల్లాకు చెందిన అధికారపార్టీకి చెందిన నాయకులు ఇసుకదందాకు తెరలేపారన్న ప్రచారం కూడా ఉన్నది. కథలాపూర్ నుంచి వయా కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మీదుగా ఆర్మూర్ వరకు వాహనాలు రావాల్సి ఉంటుంది. ఇన్ని మండలాలు దాటి టారస్ వాహనాల్లో ఆరునెలలుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన పెద్దవాగు, తక్కెల్ల వాగు నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను అక్రమంగా నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాగుల్లోంచి ఇసుకను సమీపంలోని వరదకాలువ పక్కన డంప్ చేయడం, అక్కడి నుంచి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కొందరు టారస్ వాహనాల్లో అర్ధరాత్రి వేళల్లో అక్కడికి తరలించడం సర్వసాధారణమైంది. ఆరునెలలుగా ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది.
ఈ ఆరునెలల్లో నాలుగైదు సార్లు ఒకే వ్యక్తికి చెందిన వాహనాలు పట్టుబడినా అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో అక్రమ దందా యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాహనాలను విజిలెన్స్ అధికారులు, సీసీఎస్ పోలీసులు పట్టుకోవడం విశేషం. నాలుగు నెలల క్రితం కథలాపూర్ నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనం కమ్మర్పల్లి మండలం దొమ్మర్సౌడ్ తండా ప్రాంతంలో బోల్తాపడింది. కమ్మర్పల్లి, వేల్పూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఇప్పటికే మూడునాలుగు సార్లు జగిత్యాల జిల్లా నుంచి మనజిల్లాకు ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నా, అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు.