నిజాంసాగర్, జూన్ 28: నిజాంసాగర్ మండల పరిధిలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. మండలంలోని అచ్చంపేట, మాగి గ్రామ శివారు ప్రాంతాల నుంచి కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులూ లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. మాగి గ్రామ శివారు నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అనుమతులు లభించక ఇబ్బందులు పడుతుంటే , మరో వైపు అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
సెలవు రోజుల్లో అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇసుకను పెద్దమొత్తంలో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అనుమతులు లభించకపోవడంతో గాడిదల ద్వారా ఇసుకను తెప్పించుకుంటున్నారు. 50 గాడిదల ఇసుక తీసుకువస్తే ఒక ట్రాక్టర్ లెక్కన గాడిదకు వంద రూపాయలు, ఈ లెక్కన ట్రాక్టర్కు రూ.5వేలు చెల్లించి ఇసుకను తెప్పించుకుంటున్నారు. ఈ విషయమై మాగి జీపీవో సాయిబాబాను వివరణ కోరగా, ఇసుక రవాణా విషయం తన దృష్టికి రాలేదని సెలవు రోజుల్లో ఇలా జరుగుతున్నదని తెలిపారు. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి నిజమైన లబ్ధిదారులకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.
