ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలా మంది రైతులు నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. పొలాల్లో భూసారం తగ్గి రోగాలను కలిగించే పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుంది. భూమిలోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు ఇవే…
ఎల్లారెడ్డి రూరల్, మే 7: పంటమార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్పుడూ ఒకే పంటను పండించడంతో పురుగులకు నిరంతరం ఆహారం లభ్యమై వాటి జీవితచక్రం పునరావృతమవుతూ వాటి సంతతి పెరుగుతుంది. దీంతో పంటలకు చీడపీడల బెడద ఎక్కువవుతుంది. ఒకే పంట పండించడంతో ఆ పంట వేర్లు నేలలో వ్యాపించి పోషకాలను గ్రహించడంతో కొన్ని రోజులకు ఆ మట్టి పొరలు నిస్సారమవుతాయి. ఆ నేలలో వేసే పంటల దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల వివిధ వేరు వ్యవస్థ కలిగిన పత్తి, కంది వంటి పంటలను మామూలు వేరు వ్యవస్థ గల (స్వల్ప లోతుకు చొచ్చుకుపోయే) వరి, వేరుశనగ వంటి పంటలతో మార్పిడి చేయాలి. నీటి వసతి సరిగ్గా లేని ప్రాంతాల్లో ఒక పంటను పూర్తి నీటి వసతితో పండించి, రెండో పంటను వర్షాధారంగా వేసుకుంటే నీటి వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. మిరప, టమాట, వేరుశనగ పంటలను ఆశించే లద్దెపురుగు నివారణకు జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయడంతో పొలంలో పురుగులు, ప్రాణాంతక తెగుళ్లు వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. పంట మార్పిడి చేయడంతో మట్టి సారవంతమవుతుంది. మట్టి ఉత్పాదకత స్థిరంగా కాపాడవచ్చు.
ఏటా పంట మార్పిడితో అధిక దిగుబడులు పొందవచ్చు. వివిధ రకాల తెగుళ్ల బెడద నుంచి రైతులు విముక్తి పొందుతారు. రైతులు మూస పద్ధతిలో ఒకే రకమైన పంటల్ని సాగు చేయకుండా పంట మార్పిడి విధిగా మార్చుకుంటే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తప్పనిసరిగా రైతులు పంట మార్పిడి చేయాలి.
– నాగ వెంకటరత్న, ఎల్లారెడ్డి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు