నిజామాబాద్ : పదేండ్లుగా మతసామరస్యంతో వర్ధిల్లుతున్న తెలంగాణలో మళ్లీ ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో తరుచూ మతకల్లోలాలు(Riots ), కర్ఫ్యూల (Curfews) తో భయంకరమైన పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఘటనలు పునరావృతం కాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు, గురుద్వారలకు ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ ఒక్క మతం పట్ల వివక్ష చూపకుండా పరిపాలించామని స్పష్టం చేశారు.
ముస్లింలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ముస్లి్ సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతకల్లోలాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.