ఖలీల్వాడి, డిసెంబర్ 6 :యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పిలుపును అందుకున్న మోపాల్ మండలంలోని సిర్పూర్ రైతులు ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పంట దిగుబడులు వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి నిరీక్షిం చే పని లేకపోవడం, డిమాండ్ ఉండదనే దిగులు లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన రైతులు ఉల్లిసాగు పై దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లోఉల్లికే డిమాండ్ ఉన్నది. గతంలో ఉల్లిసాగు చేసి కొంత మంది రైతులు నష్టపోయారని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధిక లాభాలు తెచ్చేది ఉల్లి ఒక్కటనే తెలుసుకొని వరికి బదులుగా ఉల్లిపంటను వేశారు. సాధారణంగా ఉల్లి కొరత వానకాలంలోనే ఉం టుంది. ఇదే సమయంలో పంటలు పండిస్తే రైతులకు భారీగా లాభాలు వస్తాయి.
వరి విడిచి..
వానకాలంలో వరి పంటను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగు చేశారు. ధాన్యం దిగుబడులు భారీ గా రావడం.. వడ్ల కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలు పెట్టడంతో యాసంగిలో ఇతర పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రభుత్వ సూచనలను అనుసరించి సిర్పూర్ గ్రా మంలో వరి వదిలి ఉల్లి సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో పది మం ది రైతులు 50 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. ఈ సాగుకు ఎక్కువగా పెట్టుబడి అవసరం లేదు. ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. వీరిని చూసి ఇతర రైతులు వారి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు.గ్రామ సర్పంచ్ సైతం వరిని విడిచి ఉల్లి పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు చిన్న గంగారెడ్డి, నడిపిముత్యం, గంగారెడ్డి, ముత్యం రెడ్డి, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, నర్సయ్య, నడిపి సాయన్న, నర్సయ్య, చిన్నగంగారెడ్డి, చింత సాయిరెడ్డి ఉల్లి పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉల్లి నారుకు భలే గిరాకీ..
రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులుగా ఇతర పంటలను పండించాలని సూచిస్తుండడంతో చాలా మంది రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే ఉల్లి, వెల్లుల్లి పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. గాంధారి మండల కేంద్రం లో నిర్వహించే అంగడిలో ఉల్లినారును విక్రయిస్తున్నారు. బిచ్కుంద, పిట్లం, బాన్సువాడ, నిజాంసాగర్ తదితర మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఉల్లినారును తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
ఉల్లి సాగుతో లాభాలు..
ఉల్లి సాగుతో అధిక లాభాలు సాధించవచ్చు. ఎక్కువగా పెట్టుబడి ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లికి డిమాండ్ ఉండడంతో ఈ పంటనే వేస్తున్నాం. ప్రభుత్వం కూడా యాసంగిలో ఇతర పంటలను వేయాలని సూచిస్తున్నది.
-ముత్యంరెడ్డి , సర్పంచ్ సిర్పూర్
రసాయన ఎరువుల వినియోగం తక్కువ..
ఉల్లి పంటకు ఎక్కువగా రసాయనాలు అవసరంలేదు. ఈ పంట ద్వారా అధిక లాభాలను సాధించవచ్చు. మూడెకరాల్లో ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నాం.
-నడిపి ముత్యం, రైతు