ధర్పల్లి, ఫిబ్రవరి 11 : సిలిండర్ గ్యాస్ లీకై పేలుడు సంభవించడంతో భార్యాభర్తలకు తీవ్రగాయాలు కావడంతోపాటు ఇల్లు ధ్వంసమైన ఘటన ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో చోటు చేసుకున్నది. సీఐ భిక్షపతి, ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన నరెండ్ల రాజన్న భార్య గంగుకు పక్షవాతం రావడంతో కొన్నేండ్లుగా మంచానికే పరిమితమైంది. ఇంట్లో వంటను రాజన్ననే చేస్తాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సిలిండర్ను వెలిగించేందుకు వెళ్లగా.. అప్పటికే గ్యాస్ లీకయి రూమంతా వ్యాపించి ఉండడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
దీంతో రాజన్నకు నిప్పంటుకోవడంతో ఆయనకు 90 శాతం వరకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇళ్లంతా ధ్వంసమైంది. రాజన్న భార్య గంగుకు సైతం నిప్పంటుకొని 20 శాతం కాలిన గాయలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. రాజన్న పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్న గదిలో గ్యాస్ లీకై ఉండడంతోనే పేలుడు సంభవించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ, ఎస్సై తెలిపారు.