‘మేం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేయాలి.. మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి..’ అంటూ వల వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆదమరిచి వివరాలు చెప్తే అంతే సంగతులు. నిమిషాల వ్యవధిలోనే ఖాతాలోని డబ్బును మాయం చేస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల సైబర్మోసాలు పెరుగుతున్నాయి. అమాయకులే కాదు.. అన్నీ తెలిసినవారూ, విద్యాధికులూ మోసపోతున్నారు. బ్యాంకు ఖాతాల్లో రూ.50వేలకు పైగా ఉన్న వారినే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏటా వందకుపైగా సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 200 కేసులు దాటాయి. అనుమానిత ఫోన్ కాల్స్కు సమాధానమివ్వొద్దని, సాధారణ, వాట్సాప్ మెస్సేజ్లలో వచ్చే లింకులను క్లిక్చేసి ముప్పు తెచ్చు కోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కామారెడ్డి కలెక్టరేట్లోని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఓ డిప్యూటీ తహసీల్దార్ బ్యాంక్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు. మూడు రోజుల క్రితం తన అకౌంట్ నుంచి రూ.3.40లక్షలు మాయం చేశారు. కేవలం 5నిమిషాల వ్యవధిలోనే కేవైసీ పేరుతో సదరు బాధితుడి నుంచి ఓటీపీ, ఇతరత్రా సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించి డబ్బులు మాయం చేసి పత్తా లేకుండా పోయారు. నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు మాయం కావడంతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు నేరుగా డిప్యూటీ తహసీల్దార్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మీ ఇంటి రుణం కోసం వేసిన డబ్బులు మాయం అయ్యాయి. ఏం చేశారంటూ వాకబు చేశారు. బ్యాంక్ అధికారులమంటూ కొంతమంది ఫోన్ చేసి వివరాలు అడిగారు… వాటికి సమాధానం ఇచ్చాను.. అంటూ జరిగిందంతా డిప్యూటీ తహసీల్దార్ చెప్పుకొచ్చారు. అంతే… బ్యాంక్ అధికారులు వెంటనే బాధితుడికి జరిగిందంతా వివరించేసరికి కంగుతిన్నాడు. దేవునిపల్లి పోలీస్స్టేషన్లో సైబర్ నేరం జరిగినట్లుగా ఫిర్యాదు చేసి నిట్టూరుస్తున్నాడు. సైబర్ నేరాల బారిన అమాయకులే కాదండోయ్… అన్నీ తెలిసిన వారు కూడా బోల్తా కొడుతున్నారనడానికి ఈ ఒక్క ఘటనే ఉదాహరణ. వాస్తవానికి నిత్య జీవితంలో అత్యంత జాగ్రత్తగా మెసులుకునే డిప్యూటీ తహసీల్దార్ కనిపించని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం తోటి ఉద్యోగులే నమ్మలేకపోతున్నారు.
పెరుగుతున్న కేసులు…
సైబర్ నేరాలకు సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పరిధిలో గడిచిన నాలుగేండ్లుగా వందలాది కేసులు నమోదయ్యాయి. ఏటా సైబర్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రజలను సైబర్ నేరాలపై పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. కళాజాత బృందాలతో ప్రదర్శనలు సైతం ఇప్పిస్తున్నారు. వాల్పోస్టర్లతో చైతన్యం కల్పిస్తున్నప్పటికీ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నది. ఇందులో నిరక్షరాస్యులే కాకుండా అక్షరాస్యులు కూడా ఉండడం విడ్డూరంగా మారింది. చాలా మంది ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులు కూడా సైబర్ బాధితులుగా ఉంటుండడంతో పోలీసులే అవాక్కవుతున్నారు.
రకరకాల పద్ధతుల్లో ట్రాప్..
నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గతంలో అక్కడక్కడ మాత్రమే వెలుగుచూసే కేసులు ఇప్పుడు జిల్లా అంతటా పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అంటూ తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో రూ.50వేలకు పైగా ఉన్న ఖాతాదారులనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. రూ.లక్షల్లో డబ్బును బ్యాంకు అకౌంట్లో జమ చేసి ఉంటే మాత్రం సైబర్ దొంగలు ఇట్టే వల పన్ని అకౌంట్ను ఖాళీ చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తున్నది. రకరకాల పేర్లతో, నంబర్లతో సైబర్ నేరగాళ్లు నిరంతరం ఫోన్లు చేస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాకచక్యంగా మెసులుకుని దుండగులకు గట్టి సమాధానం ఇస్తే వారు తిరిగి కాల్ చేసేందుకు ఇష్టపడడం లేదు. అవతలి అనుమానిత వ్యక్తులతో ముచ్చట్లలో మునిగిపోతే మాత్రం నష్టం జరగడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ మధ్య యువతులతోనూ కాల్ సెంటర్ పేరిట ఫోన్లు చేయిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు ట్రాప్లో పడకపోతే… బూతు పురాణాలు సైతం లెక్కిస్తున్నారు. డబ్బులివ్వాలంటూ దర్జాగా డిమాండ్ చేస్తూ హింసిస్తున్న ఘటనలు సైతం అనేకం వెలుగు చూస్తున్నాయి. వారికి భయపడి సమాచారం షేర్ చేసినా… డబ్బులు పంపినా… ఇక మిగిలిన సొత్తంతా సైబర్ దొంగలు దోచేయడం ఖాయమే.
యూపీఐ చెల్లింపులతో తస్మాత్ జాగ్రత్త…
ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక మనీ ట్రాన్స్ఫర్ చాలా సులభం అయ్యింది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కు నగదును బదిలీ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ పరిజ్ఞానమే మోసగాళ్లకు అందివచ్చిన అవకాశంగా మారింది. డిజిటల్ లావాదేవీలు అత్యంత సులువుగా మారడంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్లతోనూ మోసాలు పెరుగుతున్నాయి. దొంగ లింకులు పంపించి వాటిని క్లిక్ చేయాలంటూ అభ్యర్థనలు పంపుతున్నారు. ఒకవేళ వాటిని క్లిక్ చేస్తే ఇక అంతే సంగతి. మన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నట్లే. అందుకే… డిజిటల్ లావాదేవీలు ఎంత సులువో… అంతే జాగ్రత్తగా వాడుకోవడం కూడా ముఖ్యమేనని పోలీసులు చెబుతున్నారు. వాట్సప్లో వచ్చే రకరకాల లింకులను ముట్టుకుంటే ముప్పును కోరి తెచ్చుకున్నట్లే. అందుకే అనుమానిత లింకులు, వెబ్సైట్ల జోలికి పోవద్దని పోలీసులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాల్సెంటర్ కోసం ఎవరైనా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో నంబర్లు వెతికినా… ప్రమాదం వెంటాడుతుంది. అచ్చంగా కార్పొరేట్ కంపెనీల పేరుతోనే సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్ సెంటర్ నంబర్లను అందులో పెడుతున్నారు. వాటికి ఫోన్ చేస్తే పైసలు మాయం కావడం వంటివి జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల రాకతోనే సైబర్ నేరాలు ఊపందుకున్నాయి.