నిజామాబాద్: జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది. మూడు రోజులుగా కురుస్తున్న వానలవల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో పంటపొలాలను విస్తరించి వరద నీళ్లు ఎస్సారెస్పీ వైపు ప్రవహిస్తున్నాయి. అంతరాష్ట్ర వంతెన మీదుగా గోదావరి జలాలు ఉరకలేస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది ఈ స్థాయిలో ప్రవహించడం గత 15 ఏండ్లలో ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న గోదావరి జిలాలకు మంజీరా వరద తోడవడంతో ఈ స్థాయిలో ప్రవాహం కనిపిస్తోందని నీటిపారుదల అధికారులు అన్నారు.
మంజీరా నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు నిజాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 50 వేలు క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. కాగా, జిల్లాలోని కోటగిరి మండలం కొడిచర్ల శివారులో వందలాది గొర్రెలు, వాటి కాపర్లు మంజీరా నదిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మూగజీవాలను, గొర్రెల కాపరులను ఒడ్డుకు చేర్చారు.