నిజామాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా పాలన అభయ హస్తం పథకాల కోసం ప్రజల నుంచి తీసుకుంటున్న దరఖాస్తుల్లో రెండో రోజు అదే అయోమయం చోటు చేసుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా జనం కౌంటర్లకు తరలివస్తున్నప్పటికీ ఏదో తెలియని భయం మాత్రం వెంటాడుతున్నది. కొత్త పథకాలు రావాలంటే అవస్థలు పడాల్సిందేనా? అనుకుంటూ జనం నిట్టూరుస్తున్నారు. తెలంగాణ సీఎం, ఇతర మంత్రులంతా కలిసి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ స్థాయిలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడం లేదు. కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ దరఖాస్తు ఫారాల విషయంలో అస్పష్టతతో సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారు. సిబ్బంది తీరుతో జనం తికమక పడాల్సిన దుస్థితి ఎదురైంది. మాక్లూర్ మండలంలోని అనేక గ్రామాల్లో రెండో రోజు దరఖాస్తుల స్వీకరణలో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తులను జిరాక్స్ తీసుకుని వివరాలు నమోదు చేసుకొని కౌంటర్లకు వెళ్తే ద్వంద్వ సమాధానాలు ఎదురవ్వడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. దరఖాస్తులు బయటవి తీసుకోమంటూ చాలా మంది చెప్పడంతో విస్మయం వ్యక్తమైంది. మేమిచ్చే దరఖాస్తులే నింపాలంటూ గ్రామ పంచాయతీల్లో సిబ్బంది చెప్పడంతో జనం తిరుగు ముఖం పట్టాల్సి వస్తోంది.
ఆదేశాలకే సరి…
ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియలో ఉన్నతాధికారుల తీరు కేవలం ఆదేశాలకు పరిమితం అవుతున్నది. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి తమ సిబ్బందికి జాగ్రత్తలు చెప్పారు. అయినప్పటికీ కింది స్థాయిలో ఫలితాలు రాకపోగా తీవ్ర గందరగోళం ఏర్పడుతున్నది. మిగిలిన జిల్లాల్లో సవ్యంగానే పరిస్థితులున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఘోరంగా మారింది. కౌంటర్లను తనిఖీ చేయడంలోనూ నిర్లీప్తత ఎదురవుతున్నది. దరఖాస్తులను పుష్కలంగా అందుబాటులో పెట్టామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ సి బ్బంది మాత్రం అం దుకు విరుద్ధమైన ప్రకటలను పలు చోట్ల చేస్తుండడంతో సమాచార మార్పిడి అన్నది క్షేత్ర స్థాయికి సరిగా వెళ్లడం లేదని అర్థం అవుతున్నది. అభయహస్తం పథకాలకు దరఖాస్తులు చేస్తున్న వారంతా రెండో రోజు కూడా రేషన్ కార్డుల కోసమే భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక వేరే గ్రామాల్లో వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న వారు కూడా కూలీ పనులను వదులుకొని గ్రామాలకు రావాల్సి వస్తున్నది.
పత్తాలేని స్పెషల్ ఆఫీసర్లు..
మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తున్నది. మండలాల్లోనే తిష్ట వేసుకుని ఉంటూ ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు సమన్వయం చేయాల్సిన ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పత్తా లేకుండా పోయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలోనే దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఈ తంతును వారంతా పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు చెప్పే సూచనలు, సలహాలు ఏవీ కూడా పకడ్బందీగా కింది స్థాయిలో మండలాధికారులకు చేరడం లేదు. దీంతో సందిగ్ధత ఏర్పడుతున్నదని తెలుస్తున్నది. స్పెషల్ ఆఫీసర్లపై ఉన్నతాధికారులు సరైన రీతిలో నియంత్రణ చేయకపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చి పోయే కొంత మంది అధికారులైతే ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.