ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 5 : కోడలి మరణవార్త విని అత్త గుండె ఆగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ ఒకేరోజు మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మ(61).. కొడుకు పద్మారావు, కోడలు రుక్మిణి (31), ఇద్దరు మనుమరాండ్లతో కలిసి నివసిస్తున్నది. పద్మారావు రెండురోజుల క్రితం భార్య రుక్మిణితో కలిసి మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి వెళ్లాడు. వారు ఆదివారం ఉదయం స్వగ్రామానికి తిరిగిరావాల్సి ఉండగా, రుక్మిణి పడుకున్న చోటే విగతజీవిగా మారింది.
ఉదయం నిద్రలేవగానే ఉలుకూపలుకు లేని భార్యను చూసి పద్మారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భార్య మరణించినట్లు తెలుసుకొని రుద్రారం గ్రామంలోని తల్లి కమలమ్మ, బంధువులకు సమాచారం ఇచ్చాడు. కోడలి మరణవార్త విన్న కమలమ్మ మనోవేదనతో కుప్పకూలింది. గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. విష యం తెలిసిన గ్రామస్తులు పెదసంఖ్యలో పద్మారావు ఇంటికి చేరుకున్నారు. ఏడుపాయల నుంచి రుక్మిణి మృతదేహాన్ని తెచ్చేసరికి బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. తల్లి, నానమ్మ మృతదేహాల వద్ద పద్మారావు కూతుళ్లు భవిత, మోక్షిత రోదిస్తుండగా వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.