ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం… చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి…గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. ఒకప్పుడు వృద్ధుల్లోనే గుండెజబ్బులు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం యువత ఎక్కువగా హృద్రోగాల బారినపడుతున్నారు. అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. అస్తవ్యస్త జీవనశైలి.. వ్యక్తిగత ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకుండా.. కూర్చొని చేసే పనులు, పొగ తాగడం, జంక్ఫుడ్స్కు అలవాటుపడడమే ఇందుకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలకు దారి తీస్తున్నది. అంతిమంగా గుండెపై ఆ ప్రభావం పడుతున్నది.
కామారెడ్డి/ఖలీల్వాడి, మార్చి 9: ఉమ్మడి జిల్లాలో గుండెపోటు మరణాలు జనాలను కలవరపెడుతున్నాయి. జీవితంలో మనిషి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జిమ్ చేస్తూ కొందరు, ఫోన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తూ, సాధారణ పనుల్లో ఉంటూ గుండెపోటుతో కుప్పకూలి అకాల మరణం చెందుతున్నారు. కొందరిలో పోస్ట్ కొవిడ్తో ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా గుండెపోటుకు కారణమని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గుండెపోటుకు చాలా మంది బలి అవుతున్నారు. కొవిడ్ సోకి కోలుకున్నా వైరస్ ప్రభావంతో ఎండోథెలియం (గుండె రక్తనాళాల్లోని లోపలి పొర)లో మార్పులు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. యువతీయువకులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణాలు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.
గుండెపోటుకు కారణాలు..
రక్తనాళాలు మూసుకోవడంతో వచ్చే వ్యాధే గుండెపోటు. అధికంగా చక్కెర,ఉప్పు,కొవ్వు పదార్థాలు తినడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతున్నది. దీంతో రక్తసరఫరా నిలిచిపోతుంది. గుండెకు ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు వస్తుంది. ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్లో సమయానికి దొరికిన ఆహారాన్ని తింటున్నారు. ఫాస్ట్ఫుడ్కు అలవాటుపడుతున్నారు. ఆహార నియమాలను పూర్తిగా మరిచిపోయారు. పని ఒత్తిడితో మద్యం, ధూమపానం వంటివి చేస్తుంటారు. ఇది గుండెపోటుకు దారితీస్తున్నది. శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువుతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు. అధిక బరువే కాకుండా బక్కపలచగా ఉన్నవారికి కూడా గుండెపోటు రావడం గమనార్హం.
లక్షణాలు..
గుండె జబ్బుల నివారణకు
సీపీఆర్తో ప్రాణాన్ని కాపాడండి..
ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలితే సమీపంలో ఉన్నవారు వెంటనే రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయాలి. అనంతరం రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గాలిని గట్టిగా ఊదాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా చేయడాన్ని సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) అంటారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్పై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శిక్షణను ప్రారంభించింది. మొదట ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డాక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
అపోహ: గుండె జబ్బు అనేది వృద్ధాప్యంలోనే వచ్చే వ్యాధి…
వాస్తవం: మానవ జీవితంలో పదేండ్లలోనే శరీరంలో కొవ్వు నిల్వలు ప్రారంభమవుతాయి. ఇందులో కొన్ని కారకాలు కొవ్వులను శరీరంలో పేరుకునేటట్లు చేయడంతోనే చిన్న వయస్సులోనే గుండెజబ్బులు వస్తున్నాయి.
జీవనవిధానం మారాలి..
మనిషి జీవన విధానంలో మార్పు రావాలి. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ పెరిగే ఆహారాన్ని తీసుకోవద్దు. మందు, సిగరెట్, మాంసం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినొద్దు. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి.
– డా.సాయిలు (ఎండీ, జనరల్ ఫిజీషియన్)
దీర్ఘకాలిక రోగులు జాగ్రత్త..
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం చేయొద్దు. ఒత్తిడి, నిద్రలేమితో గుండెజబ్బులు వస్తాయి. బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండెపోటు రావడానికి ప్రధాన కారణం. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండడం మంచిది. సమయానికి తినడం, వ్యాయామం చేయడం ద్వారా గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
– డాక్టర్ సందీప్రావు, గుండె వైద్య నిపుణులు
యువత గుర్తుంచుకోండి..
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమట పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ధూమపానం మానేయాలి. అధిక మద్యపానం మంచిది కాదు. క్రమశిక్షణతో కూడిన క్రియాశీలకమైన జీవనశైలి ముఖ్యం. ఇంట్లో తల్లిదండ్రులకు గుండెజబ్బుల చరిత్ర ఉంటే వారి పిల్లలు కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి.
– డాక్టర్ ప్రతిమారాజ్, జీజీహెచ్, సూపరింటెండెంట్, నిజామాబాద్