రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజల చెంతకు చేరాయని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ బద్దం మధుశేఖర్ అన్నారు. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని వివరించారు. ముఖ్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేశారన్నారు. బస్తీ, పల్లె దవాఖానలతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం మరింత చేరువైందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ‘ నమస్తే తెలంగాణ’ తో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో వైద్య, వ్యవసాయ రంగం, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై, బీఆర్ఎస్ మూడోసారి గెలవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
ఆర్మూర్, నవంబర్ 11: తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల జీవన విధానం, మౌలిక వసతులు, స్థితిగతుల్లో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్ల వంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజలపై ఒక మానవత్వం, కరుణ్యం నిండి ఉన్నది. పథకాలతో ప్రజల కనీస అవసరాలు తీరుతున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నారు. రోడ్లు, ఇతర వసతులు కండ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. బస్తీ, పల్లె దవాఖానలతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం మరింత చేరువైంది. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉన్నదని, రాష్ర్టాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన కేసీఆర్ను ప్రజలు వదులుకోరని కచ్చితంగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తారని ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డా. బద్దం మధుశేఖర్ చెప్పారు. ‘ నమస్తే తెలంగాణ’ తో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో వైద్య, వ్యవసాయ రంగం, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై, బీఆర్ఎస్ మూడోసారి గెలవాల్సిన ఆవశ్యకతపై ఆయన వివరించారు.
ఆర్మూర్ ప్రాంతం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన పథకాల్లో ఉచిత విద్యుత్ , రైతుబంధుతో వ్యవసాయానికి ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ చేసి జీవం పోశారు. ప్యాకేజీ 21 పథకం కింద భీమ్గల్ ప్రాంతానికి ఎస్సారెస్పీ నీటిని తీసుకురావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో వ్యవసాయం మానేసిన వారు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలతో తిరిగి వ్యవసాయం చేస్తున్నారంటే సీఎం కేసీఆర్ పాలన ఏవిధంగా ఉందో చెప్పే అవసరం లేదు.
ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ప్రస్తుతం సంతోషంగా వచ్చి వైద్యం చేయించుకునే స్థాయికి ప్రభుత్వ దవాఖానలను కేసీఆర్ తీర్చిదిద్దారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. గర్భిణులకు ఇస్తున్న నగదు ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్, శిశువు, బాలింతలకు అవసరమైన వైద్యాన్ని అందించడం మొత్తానికి హైలెట్గా చెప్పవచ్చు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగి , ప్రైవేటులో తగ్గినప్పటికీ ఓరల్గా ఇనిస్టిట్యూషన్ డెలివరీల సంఖ్య పెరిగింది.
గతంలో మతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. కేసీఆర్ పాలనలో వైద్యరంగం అభివృద్ధితో ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటు తగ్గింది. ఈ సంఖ్య జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయి కన్నా తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో తగ్గింది. 2019 లెక్కల ప్రకారం జాతీయ స్థాయిలో వెయ్యి మంది శిశువుల్లో 23 మంది చనిపోతున్నారని రికార్డు ఉన్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఈ సంఖ్య 30గా ఉండగా, ప్రస్తుతం 20 మరణాలు నమోదు అవుతున్నాయి. ఇది జాతీయ స్థాయి కన్నా తక్కువే కావడం గమనార్హం. దీనికి కారణం ప్రభుత్వ దవాఖానల్లో వసతులు పెరగడమే.
సగటు మనిషికి అవసరమైనది వైద్యం. ప్రాథమిక , సబ్సెంటర్ల సంఖ్యను పెంచుతూ వైద్యాన్ని విస్తరించారు. దేశంలో ప్రధాన సమస్య రక్తహీనత, పౌష్టికాహర లోపం. దీనిని సైతం అధిగమించేందుకు అంగన్వాడీల ద్వారా గర్భిణులు, శిశువులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో రక్తహీనత, పౌష్టికాహార లోప నివారణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. హైదరాబాద్, వరంగల్ వంటి మహానగరల్లో బస్తీ దవాఖానలు, గ్రామాల్లో పల్లె దవాఖానలు, నియోజకవర్గ స్థాయిలో 30పడకల దవాఖాన నుంచి వంద పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేసి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో వైద్య విద్య అభ్యసించడానికి పేద , మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు అవకాశం కలిగింది. ఇందులో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉన్నది. కరోనా సమయంలో సైతం దవాఖానల్లో అన్ని సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యపరంగా స్పష్టంగా ఏది తెలుపు, ఏది నలుపు అనే విషయం ప్రజలకు కనిపిస్తున్నది.
గత ప్రభుత్వాల కన్నా కేసీఆర్ పాలన ఎంతో బాగున్నది. ఇటు వైద్యపరంగా మరోవైపు సంక్షేమం, రైతులకు అండతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో చేరువైంది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఆరోగ్యపరంగా మరింత అభివృద్ధి పరచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నా 30ఏండ్ల అనుభవం చూసిన కేసీఆర్ తనను రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నియమించారు.