ఆర్అండ్బీ అధికారులకు కొత్త తలనొప్పి మొదలైంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల విషయంలో సరికొత్త సవాల్ వచ్చి పడింది. అధికారిక నివాసాలపై వాస్తు పేరిట పేచీ నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై వాస్తు పేరిట పేచీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండు వారాలు కూడా గడువక ముందే ఇద్దరు కొత్త ఎమ్మెల్యేల మధ్య “క్యాంప్” కార్యాలయం కాక రేపుతోంది. ఒకరు అధికార పార్టీకి చెందిన వారు, మరొకరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇరువురి మధ్య సంధి కుదర్చలేక సంబంధిత అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం గా పని చేసే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ఈ కొత్త రకమైన ఆధిపత్య పోరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. గెలిచి నాలుగు రోజులు కాకుండానే చిన్నపాటి అంశంపై చిచ్చు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. విషయంలోకి వెళ్తే ..నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అధికారిక నివాసం జడ్పీ కార్యాలయం సమీపంలో ఆర్అండ్బీ అతిథి గృహం పక్కన నిర్మించారు. ఈ క్యాంప్ కార్యాలయం అర్బన్ ఎమ్మెల్యేకు సంబంధించినది కాగా.. రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన క్యాంప్ కార్యాలయాన్ని వినాయక్ నగర్లో నిర్మించారు. వీటిని గెలిచిన ఎమ్మెల్యేలు ఈపాటికి తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. వాస్తు దోషం పేరుతో పేచీలు పెట్టుకోవడంతోనే సందిగ్ధతకు తెరలేచినట్లు తెలుస్తోంది.
వాస్తు పేరిట వాయిదాలు
నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన క్యాంప్ ఫైర్పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు. అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దిన క్యాంప్ కార్యాలయాలను వాడుకోవడం మానేసి వాస్తు దోషం పేరిట వాయిదాలు వేసుకోవడం ఏంటంటూ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. కొత్త ఎమ్మెల్యేల తీరుతో రోడ్డు, భవనాల శాఖ అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయం కేటాయింపుపై అధికారులు సంప్రదింపులు జరుపడంతోనే ఈ విషయం బయట పడింది. నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేకు ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇప్పటి వరకు ఎవరూ క్యాంప్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో వినాయక్ నగర్లోని రూరల్ నియోజకవర్గానికి వెళ్లేదెవరనే ప్రశ్న ఉత్పతన్నమవుతున్నది. అర్బన్ ఎమ్మెల్యేకు సంబంధించిన క్యాంప్ కార్యాలయాన్ని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకునేందుకు సానుకూలంగా ఉన్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వాస్తు దోషం పేరుతో ఎమ్మెల్యేలు తమ అధికారిక నివాసాలను మార్చుకునే ప్రక్రియ నడుస్తుండడం సర్వత్రా చర్చకు దారితీసింది.ప్రజలకు కుల, మతాలకు అతీతంగా సేవ చేయాల్సిన వ్యక్తులే మూఢ విశ్వాసాలకు పెద్దపీట వేయడం ఏంటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.
మార్పు కష్టమే…
గతంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని చర్యలను కేసీఆర్ సర్కారు అమలు చేసింది. ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాను నిర్మించింది. ప్రజలు తమ గోడును వెల్లబోసుకునేందుకు గాను ఈ అధికారిక నివాసాలు చక్కని వేదికలుగా నిలిచేలా వీటిని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 3న వెల్లడవగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 14న బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరికి అధికారిక నివాసాలను ప్రభుత్వ యంత్రాంగం కల్పించేందుకు ప్రయత్నిస్తుండగా ఆదిలోనే ఎదురైన ఈ ఆటంకాలతో వారంతా నెత్తి పట్టుకోవాల్సి వస్తోంది. కొత్త ఎమ్మెల్యేలను కలిసేందుకు ప్రజ లు ఉత్సాహం చూపుతుండగా వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారో? తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేల అధికారిక నివాసా ల విషయంలో పేచీలేమీ లేకపోగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఈ తంతు బహిర్గతం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు వేర్వేరుగా నిర్మించిన క్యాంప్ కార్యాలయాల మార్పు జిల్లా అధికారుల చేతిలో లేనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మార్పు తథ్యమైతే ప్రభుత్వం నుంచి ఆర్డర్ రావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎవరికి వారు క్యాంప్ కార్యాలయాన్ని మార్చుకునే వెసులుబాటు ఉండబోదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ క్యాంప్ కార్యాలయంలో వాస్తు దోషం పేరుతో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా ప్రభుత్వమే నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం.