వినాయకనగర్, ఫిబ్రవరి 12: మానవత్వం మంటగలిసింది. అనుమానం అమాయకుడ్ని పొట్టన బెట్టుకుంది. స్థానికుల అత్యుత్సాహం పశువుల కాపరి ప్రాణం బలిగొన్నది. కిడ్నాపర్ అనుకొని కిరాతకంగా కొట్టి చంపేశారు. నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల వరుస కిడ్నాప్ల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో తరచూ దాడులు జరుగుతున్నాయి. కాస్త అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు చావబాదేస్తున్నారు. అమాయకులో, అగంతకులో కనీసం విచారించకుండా విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ అమాయకుడు అకారణంగా హత్యకు గురయ్యాడు.
నిజామాబాద్ మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రాజు (50) పశువుల కాపరి. తనకంటూ ఎవరూ లేని అతడు.. పశువులు మేపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. సోమవారం ఉదయం గాయత్రినగర్ వైపు వచ్చిన అతడి వేషధారణ చూసిన స్థానికులు కిడ్నాపర్గా భావించారు. ఒక్కొక్కరుగా గుమిగూడి అతడ్ని అడ్డగించారు. రాజు చెప్పేది వినకుండా కిడ్నాపరే అంటూ ఇష్టానుసారం దాడి చేశారు. ఒకరి తర్వాత మరొకరు విచక్షణారహితంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. కనీసం అతడికి నీళ్లు ఇవ్వాలన్న సోయి కూడా మరిచిపోయి కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడి చేతులు సైతం విరిగిపోయాయి. పూర్తిగా స్పృహ కోల్పోయిన రాజును దారుణంగా ఈడ్చుకెళ్లారు. డ్రెయినేజీలు తీసే కర్రలతో అతడ్ని లాక్కెళ్లారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల చోటు చేసుకున్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు సంచరిస్తున్నాయంటూ పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ప్రచారం జరిగింది. ఇది జనాల్లోకి బాగా వెళ్లడం, అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిపై దాడులు చేయడం ఇటీవల బాగా పెరిగింది. మొన్న బోధన్, నిన్న ఆర్మూర్, ఇలా ఎక్కడ కొత్తవారు కనిపించినా పట్టుకుని తంతున్నారు తప్పితే పోలీసులను పిలిచి అప్పగించాలన్న సోయిని మర్చిపోతున్నారు. కొందరి అత్యుత్సాహంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రచారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
సమాచారమందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుడ్ని దవాఖానకు తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే శ్రీధర్, గంగాధర్, మధు, రవీందర్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.