నందిపేట్, ఫిబ్రవరి 8 : అప్పు ఎగ్గొట్టేందుకు ప్రాణస్నేహితుడినే మట్టుబెట్టాడు. మొదట ఆత్మహత్య కేసుగా నమోదైనా పోలీసులు లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు సంబంధించిన వివరాలను నందిపేట్ పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రభాకర్రావు వెల్లడించారు. మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్, నాగం భోజేందర్ అలియాస్ చింటు చిన్ననాటి స్నేహితులు. భోజేందర్కు అవసరముందని సుమారు రూ.2 లక్షల వరకు ఎవరికీ తెలియకుండా శ్రీకాంత్ వద్ద అప్పుగా తీసుకున్నాడు. కాగా శ్రీకాంత్ నవంబర్లో దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులను తిరిగి ఇవ్వాలని భోజేందర్ను అడిగాడు.
డబ్బులు లేకపోవడంతో అప్పు ఎగ్గొట్టేందుకు శ్రీకాంత్ను చంపాలని భోజేందర్ ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం డిసెంబర్ 3న సాయంత్రం ఉమ్మెడ బ్రిడ్జి వద్దకు శ్రీకాంత్ను రమ్మని చెప్పాడు. శ్రీకాంత్ బ్రిడ్జి గోడపై కూర్చోవడంతో అదును చూసి ఒక్కసారిగా గోదావరిలోకి తోసేశాడు. శ్రీకాంత్ బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అనంతరం భోజేందర్ దుబాయ్ వెళ్లిపోయాడు. తన తమ్ముడు శ్రీకాంత్ కనబడడం లేదని అన్న ఏర్గట్ల బాల్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు ఉమ్మెడ బ్రిడ్జిపై శ్రీకాంత్ వాహనం దొరకడంతో గోదావరి నదిలో జాలర్లతో గాలింపు చేపట్టారు. చివరకు శ్రీకాంత్ మృతదేహం లభించింది. దీంతో ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.
శ్రీకాంత్ దుబాయ్ నుంచి వచ్చిన 25 రోజులకే ఈ సంఘటన జరగడంతో అనుమానం వచ్చిన పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలు లేకపోవడంతో ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది మరింత లోతుగా విచారణ చేపట్టగా హత్యకు ముందు రోజు భోజేందర్, శ్రీకాంత్ ఇద్దరు కలిసి తిరిగినట్లు వారి సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు. శ్రీకాంత్ చనిపోయిన నాటి నుంచి కనబడకుండా పోయిన భోజేందర్పై అప్పటికే అనుమానం ఉండడంతో ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నెల తర్వాత దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన భోజేందర్ను బుధవారం నందిపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్లో అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు ఎగ్గొట్టేందుకు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని ఏసీపీ ప్రభాకర్రావు వెల్లడించారు.