నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 28: నగరంలో పట్టపగలే ఓ యువకుడిని కిడ్నాప్ చేశారనే వార్త బుధవారం కలకలం రేపింది. పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. అసలేం జరిగిందంటే.. త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ యువకుడు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అతడి వద్దకు వేగంగా వచ్చిన ఓ కారు (టీఎస్ 29 సీ/6688)లోంచి ముగ్గురు దిగి చితకబాదారు.
అనంతరం యువకుడిని బలవంతంగా కారులో ఎక్కించకుని వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీపీ నాగరాజు ఆదేశాల మేరకు వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబు, త్రీటౌన్ ఎస్సై శ్రావణ్కుమార్ తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా కారు యజమాని బోధన్ మండలానికి చెందిన బాగయ్య యాదవ్గా గుర్తించారు. ఆయనను విచారించగా కారు తనదేనని, తన అల్లుడు కిషోర్ యాదవ్ తీసుకెళ్లినట్లు చెప్పడంతో పోలీసులు కిషోర్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
మరోవైపు, బోధన్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు నిజామాబాద్-బోధన్ మార్గంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు, కిషోర్కు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా తాము కిడ్నాప్ చేయలేదని, అతడిని నిజామాబాద్లోనే వదిలేశామని చెప్పాడు. అతడి నుంచి బాధితుడి ఫోన్ నెంబర్ను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి కాల్ చేస్తే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశాడు. సాయంత్రం 5.30 గంటల సమయంలో బాధితుడు వన్టౌన్ ఠాణాలో ప్రత్యక్షం కావడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
మాట్లాడుకునేందుకే వెళ్లాం..
బాధితుడ్ని పోలీసులు విచారించగా, తన పేరు నరేశ్ అని, నిజామాబాద్లోనే ఫిజికల్ ట్రెయినింగ్ ఇస్తానని చెప్పాడు. తనను ఎవరూ అపహరించలేదని, కిడ్నాప్ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. కారులో వచ్చిన వారితో మాట్లాడేందుకే తాను వెళ్లానని వివరించాడు. బాధితుడు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపారు. మరోవైపు, కారులో వచ్చిన ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో వారిని విడిచిపెట్టారు.