బీర్కూర్, సెప్టెంబర్ 14: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్స్థాయిలో విద్యను అందిస్తోంది. సీఎంకేసీఆర్ ప్రకటించిన కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.లక్షా 20వేలు ఖర్చు చేస్తోంది. గురుకులాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తోంది. దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, పెన్నులు, పెన్సిళ్లు, విద్యార్థులు పడుకొనేందుకు మంచాలను ప్రభుత్వం అందజేస్తోంది. విద్యార్థులకు నెలనెలా కాస్మొటిక్ చార్జీలను చెల్లిస్తుంది.
కామారెడ్డి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 26 గురుకుల పాఠశాలలు, 18 గురుకుల జూనియర్ కళాశాలలు, రెండు డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలో 17,780 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఏటా సుమారుగా రూ.215 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు 7 , కళాశాలలు 4 ఉన్నాయి. వీటిలో సుమారు 3,580 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మైనారిటీ పాఠశాలలు నాలుగు, కళాశాలలు రెండు ఉన్నాయి. వీటిలో 2240 మంది విద్యార్థులు చదువుకుంటుంన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు 11, కళాశాలలు 11, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. అందులో 8,360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్టీ గురుకుల పాఠశాలలు నాలుగు, ఒక జూనియర్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, అందులో 3,600 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో గురుకులాల్లో విద్యార్థులదే పైచేయిగా నిలిచింది.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు కలిపి 44 ఉండగా అందులో 13 పాఠశాలలు, కళాశాలలకు సొంతభవనాలు ఉన్నాయి. మిగిలిన 21 పాఠశాలలు, కళాశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బీర్కూర్ మండలంలో రెండేండ్ల క్రితం ఏర్పాటైన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రూ.6 కోట్లను మంజూరు చేయించారు. దీంతో భవన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అదేవిధంగా మిగిలిన భవనాలను నిర్మించాల్సి ఉంది.
మెనూ ప్రకారం భోజనం
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాలను అందిస్తున్నారు. ఉదయం మొలకలు లేదా బెల్లంతో కలిపిన రాగి జావ అందిస్తారు. ఉదయం బ్రేక్పాస్ట్లో ఆలూటమాట లేదా పప్పు, టమాటాతో కూడిన కూరతో పూరి లేదా చపాతీ, మధ్యాహ్న భోజనంలో బగారా అన్నం. తెల్ల అన్నం, మటన్ లేదా చికెన్, గుడ్డు పులుసు, టమాటా పప్పు, వెజ్ ఫ్రై, సాంబార్, పెరుగు ఇలా రోజుకో రకమైన వంటకాలతో భోజనం అందిస్తారు. సాయంత్రం స్నాక్స్లో భాగంగా గురుకులాల్లో తయారు చేసిన పల్లిపట్టీ, బెల్లంతో కూడిన బాయిల్డ్ పల్లీలు, రాత్రి డిన్నర్లో రైస్, వెజిటేబుల్ కర్రీ, నెయ్యితో కూడిన చట్నీ, రసం, మజ్జిగ, సీజనల్ పండ్లను అందజేస్తారు. వీటిని ప్రతి రోజూ ఒకేమాదిరిగా కాకుండా మారుస్తూ విద్యార్థులకు వండి పెడతారు.
ఉత్తమ విద్యార్థులకు ఐఐటీ శిక్షణ
తొమ్మిది, పది తరగతుల విద్యార్థులను ఎస్వోఈ (స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ) పరీక్ష ద్వారా ఎంపిక చేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం సీవోఈ(కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ)కి ఎంపిక చేసి ఐఐటీ, నిట్ కోసం ప్రత్యేక విద్యాబోధన చేస్తారు. సంవత్సరానికి ఒక్కో సొసైటీ నుంచి సుమారు 250 మంది పాఠశాల విద్యార్థులు, 250 మంది కళాశాల విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారు.