భీమ్గల్, ఫిబ్రవరి 21: అడవిబిడ్డల మార్గదర్శి, బంజారా బిడ్డలకు హిందూదైవం గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భీమ్గల్ పట్టణంలోని బంజారాభవన్లో బుధవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బంజారాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నూతన జీపీలు, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, పోడు పట్టాలు అందజేయడంలాంటి కార్యక్రమాలు చేశామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రూ.50లక్షలతో బంజారా భవన్ నిర్మించామన్నారు.
ప్రతి తండాకు తీజ్ భవనాలు మంజూరు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను ఆపివేయాలని అన్నట్లు సమాచారమున్నదని, తండా పెద్దమనుషులు అధికారులను కలిసి ఆ పనులను ప్రారంభించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆపాలనుకోవడం సరికాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పనులను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అధికారి నాగూరావు, జడ్పీటీసీ రవి, కన్నె సురేందర్, బంజారా నాయకులు శర్మానాయక్, తుక్కాజి, లింగం, తిరుపతి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.