కామారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న నీటి వనరులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ పథకం’ కింద చెరువుల మరమ్మతులు చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో 1,190 చెరువులను రూ.431.03 కోట్లతో పునరుద్ధరించారు. దీంతో చెరువుల సామర్థ్యం పెరిగి ఆయకట్టు కింద సాగు విస్తీర్ణంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని చెరువులు జలకళ సంతరించుకొని నిండు కుండల్లా మారాయి. జిల్లా వ్యాప్తంగా రూ.273.83 కోట్లతో 50 చెక్ డ్యాములను నిర్మించగా.. నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడం గమనార్హం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. వారి పాలనలో బావులు, బోర్లే దిక్కయ్యాయి. సాగునీరు సరిగా అందకపోవడంతో అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్యల పాలయ్యారు. కాకతీయుల నుంచి ఆసఫ్ జాహీల దాకా నిర్మించి, పరిరక్షించిన చెరువులు శిథిలమైపోయాయి. చెరువుల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. దీంతో వర్షాకాలంలో కురిసిన వర్షపునీరు చెరువుల్లో నిల్వ ఉండక పొంగిపొర్లుతూ నదుల ద్వారా సముద్రం పాలయ్యేది. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. మిషన్ కాకతీయ పథకం రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మతు చేసి, పూడికను తీసి చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో మొత్తం 1,190 చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టారు. తూములను పునఃనిర్మించారు.
చెక్డ్యాముల ద్వారా భూగర్భ జలాలు
మిషన్ కాకతీయకు తోడు చెక్డ్యాముల ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాన్సువాడ నియోజకవర్గంలో 4 చెక్డ్యాములను రూ.144.88 కోట్లు, జుక్కల్ నియోజకవర్గంలో 19 చెక్డ్యాములను రూ.66.70 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 5 చెక్డ్యాములను రూ.7.40కోట్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22 చెక్డ్యాములను రూ.54.55 కోట్లతో నిర్మించారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాల కారణంగా అడవుల్లో కురిసిన నీరు చెక్డ్యాముల వద్ద నిల్వ ఉంటున్నది. దీంతో భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్నది.
చెరువులు బలోపేతమయ్యాయి
సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మతు చేసి ఆధునీకరించారు. దీంతో చెరువులు బలోపేతమయ్యాయి. నేడు ఎన్ని భారీ వర్షాలు కురిసినా చెరువులు చెక్కు చెదరకుండా ఉన్నా యి. భారీగా నీరు వచ్చి చేరింది. పూడిక తీత కారణంగా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
-కొర్ల పోతురెడ్డి, రైతు నాయకుడు, బాన్సువాడ
భూగర్భ జలాలు పెరిగాయి..
మిషన్ కాకతీయతో చెరువులు పూర్వ కళను సంతరించుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు కళకళలాడుతున్నాయి. ఒక్క చెరువు కూడా తెగిపోలేదు. అన్ని చెరువుల్లో నీరు నిల్వ ఉంది. అలుగులు పారుతున్నాయి. చెరువులను బలోపేతం చేయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రెండు పంటలు వేసుకోగలుగుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల తరపున ధన్యవాదాలు.
-ఎం. గణేశ్ నాయక్, కొండాపూర్, రాజంపేట మండలం
రెండు పంటలకూ నీరు..
మిషన్ కాకతీయతో చెరువుల్లోకి నీరు పుష్కలంగా వచ్చి చేరుతున్నది. గతంలో చెరువుల్లో పూడిక కారణంగా నీరు నిండి అలుగులు పారేవి. కానీ నేడు పూడిక తీతతోపాటు లోతు పెంచడంతో నీరు నిల్వ ఉంటున్నది. కట్టలను బలోపేతం చేయడం, తూములను మరమ్మతు చేయడంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. రానున్న రెండు పంటలకూ నీరు అందుతుంది. జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలను సాగు చేసుకోవచ్చు.
– శ్రీనివాస్, సీఈ, నీటిపారుదల శాఖ
నియోజకవర్గాల వారీగా చెరువుల మరమ్మతులకు వెచ్చించిన నిధుల వివరాలు..
ఆయా నియోజకవర్గాల్లో చెరువులను మరమ్మతు చేయడంతో ప్రస్తుతం కురిసిన వర్షాలతో నిండుకుండల్లా మారాయి. అలుగులు పారగా, మిగిలిన నీరు చెరువుల్లో ఉంటుంది. వానకాలంతోపాటు యాసంగిలోనూ ఈ చెరువుల్లోని నీరు సాగు కోసం ఉపయోగపడనున్నది.