నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూర్ గ్రామ శివారులో పల్లెప్రకృతి వనం ఎదురుగా ఉన్న మహాలక్ష్మీ ఆలయాన్ని రూ.50 లక్షలతో నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న మహాలక్ష్మీ ఆలయం చిన్నగా ఉన్నది. ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడంలో గ్రామానికి చెందిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ సభ్యుడు సుధీర్, పాల్దా సొసైటీ చైర్మన్ జితేందర్, వీడీసీ సభ్యులు, మహాలక్ష్మీ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ.50 లక్షల అవసరమని అంచనా వేసినట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే.. రూ.10 లక్షలు గ్రామం తరఫున బ్యాంకులో డిపాజిట్ చేస్తే, మిగతా రూ.40 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తామని హామీనిచ్చారు. గ్రామస్తులు ప్రత్యేక సమావేశమై ఆలయ నిర్మాణ ఆవశ్యకతపై చర్చించారు. గ్రామంలో ఆర్థిక స్థోమత కలిగిన వారు పెద్ద మొత్తంలో, ప్రతి ఇంటి నుంచి మహాలక్ష్మీ అమ్మవారి మీద భక్తితో కొంత విరాళం ఇచ్చారు. గ్రామస్తులు రూ.10 లక్షలు విరాళాన్ని అందించి ఐక్యతను చాటారు. రూ.10లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయగా.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూ.40 లక్షల నిధులు మంజూరు చేయించి సంబంధిత పత్రాలను సోమవారం సాయంత్రం గ్రామపెద్దలకు అందజేశారు. 9 ఏండ్లు గ్రామానికి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న యువకుడు, సర్పంచ్ మెట్టు అశోక్ గ్రామపెద్దల సహకారంతో కొండూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మా గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేము. ఎమ్మెల్యే మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాము. తాజాగా మహాలక్ష్మీ ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యేకు మా గ్రామస్తులమంతా రుణపడి ఉంటాము.
– మెట్టు అశోక్, ఆకుల కొండూర్ సర్పంచ్