పాదయాత్ర చేపట్టి ప్రధాన సమస్యలు గుర్తించి పరిష్కరించాలి
ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలి
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
విద్యానగర్, మే 30 : వచ్చే నెల 3 నుంచి పల్లె , పట్టణ ప్రగతిలో భాగం గా మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోని పట్టణాలు, పల్లెల కన్నా మన రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని అన్నారు. గ్రామాల్లోని డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వంద శాతం ఉపయోగంలో ఉం డేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కల వివరాలపై సమీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ తొమ్మిది శాతం పెరిగితే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. రాష్ట్రంలో పచ్చదనం ప్రతిఏటా పెరుగుతుందని చెప్పారు. మొక్కలు పెంచడంతో రాష్ట్రంలో ఆరు శాతం పచ్చదనం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. మరో మూడు శాతం పెంచగలిగితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదన్నారు. జూన్ 3న ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని సూచించారు. యువకులు, పిల్లల దృష్టిని క్రీడల వైపు మళ్లించడానికి ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రతి ప్రాంగణానికి రూ.50 వేల నిధులను ఇవ్వనున్నట్లు చెప్పారు. యువత,పిల్లలు గ్రామాల్లో ఆడుకొనేలా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం విద్యుత్, రోడ్లు, సాగునీరు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.